- కేసు నమోదు చేసిన పోలీసులు
కాకతీయ,శంకరపట్నం:కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్–12 కార్యక్రమంలో భాగంగా శంకరపట్నం మండలం కొత్తగట్టు గ్రామంలో బాల కార్మికులను గుర్తించి కేసు నమోదు చేశారు. అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, హుజూరాబాద్ (ఎఫ్ఏసీ) గుండాటి చక్రధర్ రెడ్డి తన బృందంతో కలిసి తనిఖీలు నిర్వహిస్తుండగా, కొత్తగట్టు గ్రామంలోని కేవీకే గ్రానైట్స్ పరిశ్రమలో స్టోన్ కటింగ్, డ్రిల్లింగ్ పనులకు 18 సంవత్సరాలు నిండని ముగ్గురు బాలలను పనిలో నిమగ్నం చేసినట్లు గుర్తించారు. ఈ విషయమై బాల కార్మికులతో పని చేయిస్తున్న వ్యక్తితో పాటు సంబంధిత కేవీకే గ్రానైట్స్ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు కేశవపట్నం ఎస్ఐ శేఖర్ రెడ్డి తెలిపారు. బాల కార్మికులను పనిలో పెట్టుకునే వారిపై కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.

