పీఎం కిసాన్ పొడిగింపు…కొత్త రైతులకు అందని సాయం
కొత్త పట్టాదారులకు పీఎం కిసాన్ వర్తింపుపై సందిగ్ధత
కాకతీయ, కరీంనగర్ : రైతులకు పెట్టుబడి సాయం అందించే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు మరో ఐదేళ్లు పొడిగించింది. ఇందుకోసం రూ.3.15 లక్షల కోట్ల వ్యయానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సుమారు 2.24 లక్షల మంది రైతులు లబ్ధి పొందనున్నారు. పథకం కింద ప్రతి అర్హ రైతుకు ఏడాదికి రూ.6,000 చొప్పున మూడు సమాన విడతల్లో నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు.
కొత్త రైతుల సమస్యలు పరిష్కారం ఎప్పుడో..!
పథకం కొనసాగుతున్నప్పటికీ 2019 తర్వాత భూములు కొనుగోలు చేసిన రైతులు, కుటుంబ విభజనలతో కొత్త పట్టాదారులుగా నమోదైన వారు ఇప్పటికీ పీఎం కిసాన్ సాయానికి దూరంగానే ఉన్నారు. కొత్త నమోదులకు పోర్టల్లో అవకాశం లేకపోవడం, ఇ-కేవైసీ, ఆధార్ సీడింగ్, భూ రికార్డుల అనుసంధానంలో నెలకొన్న సాంకేతిక సమస్యల కారణంగా వేలాది మంది రైతులు అర్హత సాధించలేకపోతున్నారు. దీంతో పథకం పొడిగింపుపై ఆనందం వ్యక్తం చేస్తున్నప్పటికీ, తమకు ఎప్పుడు వర్తింపజేస్తారోనన్న ఆందోళన కొత్త రైతుల్లో వ్యక్తమవుతోంది.కొత్త పట్టాదారుల దరఖాస్తులను వెంటనే పరిశీలించి అర్హులైన రైతులను పథకంలో చేర్చాలని రైతులు కోరుతున్నారు. అలాగే పోర్టల్లో కొత్త నమోదులను ప్రారంభించడం, ఇ-కేవైసీ, ఆధార్ సీడింగ్ సమస్యలను త్వరగా పరిష్కరించడం ద్వారా అర్హులైన ప్రతి రైతుకు పీఎం కిసాన్ సాయం అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు.

