మాజీ ఎమ్మెల్యే గొర్రె సిద్దయ్య కన్నుమూత
* 1978లో 7,056 ఓట్ల మెజారిటీతో ఘన విజయం
* 95 ఏళ్ల వయసులో హైదరాబాద్లో తుదిశ్వాస
కాకతీయ,చేర్యాల: పూర్వపు చేర్యాల నియోజకవర్గ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గొర్రె సిద్దయ్య (95) కన్నుమూశారు. వృద్ధాప్యంతో పాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆదివారం హైదరాబాద్లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. సిద్దయ్య మృతి వార్తతో కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు, చేర్యాల ప్రాంత ప్రజల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

7,056 ఓట్ల మెజారిటీతో చారిత్రక విజయం
ఉమ్మడి వరంగల్ జిల్లా మద్దూరు మండలం బైరాన్పల్లి గ్రామానికి చెందిన గొర్రె సిద్దయ్య 1978 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి చేర్యాల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ (ఐ) అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో సిద్దయ్యకు 18,547 ఓట్లు రాగా, ఆయన ప్రత్యర్థి నిమ్మ రాజారెడ్డికి 11,491 ఓట్లు వచ్చాయి. దీంతో 7,056 ఓట్ల భారీ మెజారిటీతో సిద్దయ్య ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నియోజకవర్గ ప్రజల సమస్యలను అసెంబ్లీ వేదికగా ప్రస్తావిస్తూ, ప్రాంత అభివృద్ధికి కృషి చేశారు. ప్రజలతో మమేకమై పనిచేసిన నాయకుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు లభించింది.
1983లోనూ బరిలో.. రెండో స్థానంలో
1978 విజయంతో రాజకీయంగా తనదైన ముద్ర వేసిన సిద్దయ్య 1983 ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో నిమ్మ రాజారెడ్డి విజయం సాధించగా, సిద్దయ్య 20,155 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు.
చేర్యాల నియోజకవర్గంతో చెరగని అనుబంధం
1961లో ఏర్పడిన చేర్యాల అసెంబ్లీ నియోజకవర్గం 2008లో రద్దయింది. ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన మాజీ ఎమ్మెల్యేగా గొర్రె సిద్దయ్య రాజకీయ ప్రస్థానం ప్రత్యేకతను సంతరించుకుంది. అనంతరం ఆయన కుటుంబం హైదరాబాద్లో స్థిరపడింది.
భార్య మృతి.. కుమారుడు న్యాయవాది
గొర్రె సిద్దయ్య భార్య గొర్రె శాంతమ్మ సుమారు మూడు సంవత్సరాల క్రితమే మృతి చెందారు. సిద్దయ్యకు ఒక్క కుమారుడు గొర్రె భాస్కర్ ఉన్నారు. భాస్కర్ హైదరాబాద్ హైకోర్టులో న్యాయవాదిగా విధులు నిర్వహిస్తున్నారు. సిద్దయ్య మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
పార్థివదేహానికి కొమ్మూరి ప్రతాప్రెడ్డి నివాళి
సిద్దయ్య మృతి విషయం తెలుసుకున్న పలువురు రాజకీయ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంతాపం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ జనగామ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్రెడ్డి హైదరాబాద్లో సిద్దయ్య పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
సిద్దయ్య మృతి కాంగ్రెస్ పార్టీకి, చేర్యాల ప్రాంత ప్రజలకు తీరని లోటని పలువురు నాయకులు పేర్కొన్నారు. ఆయన రాజకీయ సేవలను, ప్రజల కోసం చేసిన కృషిని స్మరించుకున్నారు.

