బందిపోటు ముఠాపై పీడీ యాక్ట్
పీఎంజే జ్యువెలర్స్ దోపిడీ కేసులో కీలక చర్య
సిబ్బందిపై కాల్పులు జరిపి రూ.82 లక్షల బంగారం దోపిడీ
ప్రధాన నిందితులైన ఐదుగురిపై నిర్బంధ ఉత్తర్వులు
ఇప్పటివరకు ఎనిమిది మంది అరెస్టు
చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలింపు
పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం
కాకతీయ, కరీంనగర్ : నేర కార్యకలాపాలను అరికట్టడం, ప్రజలకు భద్రత కల్పించడంతో పాటు నేరస్థుల్లో భయాన్ని కలిగించేందుకు పీ.యం.జే. జ్యువెలర్స్ బందిపోటు కేసులో ప్రధాన నిందితులైన ఐదుగురిపై పీడీ యాక్ట్ అమలు చేసినట్లు పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం తెలిపారు. ప్రజల భద్రతకు విఘాతం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని, చట్టపరమైన చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. 2026 మే 3న కరీంనగర్ పట్టణంలోని పీ.యం.జే. జ్యువెలర్స్ దుకాణంలోకి చొరబడిన దుండగులు సిబ్బందిపై కాల్పులు జరిపి రూ.82 లక్షల విలువైన బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు ఇప్పటివరకు ఎనిమిది మందిని అరెస్టు చేశారు. వారిలో ప్రధాన నిందితులుగా గుర్తించిన ఐదుగురిపై ఆదివారం పీడీ యాక్ట్ కింద నిర్బంధ ఉత్తర్వులు జారీ చేశారు. పీడీ యాక్ట్ కింద నిర్బంధించిన వారిలో పశ్చిమ బెంగాల్కు చెందిన రఘునాథ్ కర్మాకర్ అలియాస్ జాగీరా సింగ్, బీహార్లోని నలందకు చెందిన రావిష్ కుమార్ అలియాస్ ప్రద్యుమాన్, సూర్యమణి కుమార్ అలియాస్ సనోజ్, పాట్నాలోని ఫుల్వారీ షరీఫ్కు చెందిన యాదవ్ అలియాస్ జైనుల్ అబ్దిన్, మహమ్మద్ ఆదిల్ ఖాన్ ఉన్నారు. నేర కార్యకలాపాలను నియంత్రించడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలకు పాల్పడకుండా నిరోధించేందుకు ఈ చర్య తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
జిల్లా జైలు నుంచి చర్లపల్లికి
పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం జారీ చేసిన నిర్బంధ ఉత్తర్వులను కరీంనగర్ జిల్లా జైలులో ఉన్న నిందితులకు అందజేశారు. అనంతరం వారిని చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించారు. కేసులో ప్రధాన నిందితులపై పీడీ యాక్ట్ అమలు చేయడంతో పోలీసు శాఖ కఠిన వైఖరిని స్పష్టం చేసింది. పీడీ యాక్ట్ అమలులో కీలక పాత్ర పోషించిన కరీంనగర్ పట్టణ ఏసీపీ ఎన్. వెంకటస్వామి, రెండో పట్టణ సీఐ కె. సృజన్రెడ్డిని పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం అభినందించారు. నేరాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని, ప్రజల భద్రతకు విఘాతం కలిగించే వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు.

