పథకాల అమలులో ప్రభుత్వం విఫలం
రైతు భరోసా, కల్యాణ లక్ష్మి హామీలు ఏమయ్యాయి?
సంక్షేమ పథకాలను ఎందుకు అమలు చేయడం లేదు
మేడిగడ్డ పునర్నిర్మాణం కేసీఆర్తోనే సాధ్యం
మళ్లీ ఉద్యమం నాటి రోజులు కనిపిస్తున్నాయి..
జగిత్యాలలో కేసీఆర్ బహిరంగ సభ భారీ సక్సెస్
బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి జీవన్రెడ్డి
కాంగ్రెస్పై విమర్శలతో దాడి చేసిన సీనియర్ లీడర్
కాకతీయ, జగిత్యాల : జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బహిరంగ సభకు లభించిన భారీ స్పందన తెలంగాణ ఉద్యమ రోజులను తలపించిందని మాజీ మంత్రి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో ముందంజలో ఉంటే, నేడు పరిస్థితి తలకిందులైందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుబంధు వంటి పథకాలతో గత ప్రభుత్వం రైతులకు భరోసా కల్పించిందని, కానీ ప్రస్తుత ప్రభుత్వం రైతు భరోసా సహా కీలక హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని జీవన్రెడ్డి విమర్శించారు. పంటల బీమా పథకం అమలులో నిర్లక్ష్యం వహిస్తున్నారని, భూమిలేని రైతులకు ఇచ్చే ప్రోత్సాహకాలను నిలిపివేశారని ఆరోపించారు. కల్యాణ లక్ష్మి పథకం కింద బంగారం ఇస్తామని చెప్పి మాట తప్పారని, కేసీఆర్ కిట్ వంటి పథకాల పేర్లు మార్చినా కనీసం వాటిని సరిగ్గా కొనసాగించాలని సూచించారు. ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో రాష్ట్ర వాటా చెల్లించకపోవడం వల్ల కేంద్ర నిధులు కూడా నిలిచిపోయాయని పేర్కొన్నారు.
మేడిగడ్డపై ప్రభుత్వం కావాలనే కాలయాపన..
మేడిగడ్డ ప్రాజెక్టు దెబ్బతిని నెలలు గడుస్తున్నా ప్రభుత్వం మరమ్మతులు చేపట్టకుండా కేవలం రాజకీయ ఆరోపణలకే పరిమితమైందని జీవన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నివేదికలు వచ్చినా చర్యలు తీసుకోకపోవడం వెనుక కేసీఆర్పై బురద చల్లే ప్రయత్నం కనిపిస్తోందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణను సస్యశ్యామలం చేసిన ఘనత కేసీఆర్దేనని, మేడిగడ్డ పునర్నిర్మాణం కూడా ఆయనతోనే సాధ్యమని స్పష్టం చేశారు. రేవంత్రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం ప్రజలను నిరాశపరిచిందని, ఆర్టీసీ, సింగరేణి కార్మికులు, హోమ్ గార్డులు అందరూ అసంతృప్తితో ఉన్నారని తెలిపారు.
ప్రజల ఆత్మగౌరవం కోసమే ఈ నిర్ణయం..
కాంగ్రెస్ పార్టీని ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలా నడుపుతున్నారని ఆరోపిస్తూ, తెలంగాణ అభివృద్ధి కోసం, ప్రజల ఆత్మగౌరవం కోసమే తాను రాజకీయ నిర్ణయాలు తీసుకున్నానని వెల్లడించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు, మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, దావా వసంత, లోక బాపురెడ్డి, హరిచరణ్ రావు, శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

