పెరగనున్న దడువాయిల చార్జీలు
ఇప్పటికే రూ.6.25 వసూలు
తాజాగా మరింత పెంచేందుకు కసరత్తు
సాయంత్రం కలెక్టర్ తో జరిగే మీటింగ్ లో నిర్ణయం
కాకతీయ, వరంగల్ : వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ లో దడువాయిల చార్జీలు మరోసారి పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ మార్కెట్ లో రూ.6.25 వసూలు చేస్తున్నారు. ఉత్తర తెలంగాణలోని ఏమార్కెట్లో లేనంతగా పెద్దమార్కెట్ అన్నందుకు పెద్దమొత్తంలోనే చార్జీ తీసుకుంటున్నారు. మళ్లీ తాజాగా పెంచేందుకు కసరత్తు జరుగుతోంది. రైతుల నుంచి రూ.6.25 వసూలు చేయడమే కాకుండా ట్రేడర్ల నుంచి అదనంగా రూ.0.50 తీసుకుంటున్నారు. మొత్తంగా రూ.6.75 తీసుకుంటున్నారు. ఈ క్రమంలో మరోమారు చార్జీలు పెంచాలనుకోవడం రైతులపై భారం మోపినట్లవుతుందనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. ఒకపక్క రైతుల సరుకును కూలీలు, హమాలీలు దౌర్జన్యంగా లాక్కుంటూ కర్షకులకు నష్టం కలిగిస్తున్నారు. వ్యాపారులు ధరల్లో వ్యత్యాసంతో వాస్తవ ధర పెట్టడం లేదు. అంతేకాదు, దడువాయిలు కొంత సరుకును బ్లాక్ మార్కెటింగ్ కు తరలిస్తూ రైతులకు తీరని అన్యాయం చేస్తున్నారు. ఈ క్రమంలో రైతులకు దడువాయిల చార్జీలు పెంచడం కర్షకులపై ఆర్థిక భారం మోపినట్లవుతుందని రైతులు పలువురు వాపోతున్నారు. ఎంత పెంచినా ఆ భారం ట్రేడర్ల నుంచి వసూలు చేయాలని కోరుతున్నారు.
ఇతర మార్కెట్లలో దడువాయిల చార్జీలు ఇలా..
ఖమ్మం మార్కెట్లో రూ.6.11 పైసలు దదువాయిల కోసం రైతుల నుంచి వసూలు చేస్తున్నారు. సూర్యాపేట మార్కెట్ లో రూ.6.09, కేసముద్రంలో రూ.6, మహబూబాబాద్ రూ.6, కరీంనగర్ రూ.5.77, సూర్యపేటలో రూ.5.39, పెద్దపల్లిలో రూ.5, జమ్మికుంటలో రూ.4, నిజామాబాద్ లో రూ.4.36పైసలు తీసుకుంటున్నారు. నిజామాబాద్ లో గతంలో రూ.3.96 ఉండగా, ఇటీవలే రూ.0.40 పైసలు పెంచారు. ఇక ఏనుమాముల మార్కెట్ లో రూ.6.25 రైతుల నుంచి, 50 పైసలు ట్రేడర్ల నుంచి మొత్తంగా రూ.6.75 వసూలు చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం వరంగల్ కలెక్టర్ తో జరిగే సమావేశంలో మరింత పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ మొత్తాన్ని రైతుల నుంచి వసూలు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. అయితే, ఆ భారాన్ని ట్రేడర్లపైనే వేయాలని రైతులు కోరుతున్నారు.

