కొత్తగూడెంలో ‘ఇంధన’ సెగ..
బంకుల వద్ద వాహనదారుల కుమ్ములాట!
అర్ధరాత్రి నుంచి బారులు తీరిన జనం.. తోపులాటతో ఉద్రిక్తత
కృత్రిమ కొరతపై ఆగ్రహం.. రంగంలోకి దిగిన త్రీటౌన్ పోలీసులు
ప్రభుత్వాలు స్పందించకుంటే జీవనం స్తంభిస్తుందని వాహనదారుల ఆవేదన


కాకతీయ, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో పెట్రోల్, డీజిల్ కొరత సెగ ఒక్కసారిగా భగ్గుమంది. ఆదివారం అర్ధరాత్రి నుంచి పట్టణంలోని పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు కిలోమీటర్ల మేర బారులు తీరారు. ముఖ్యంగా పోస్ట్ ఆఫీస్ సెంటర్లోని పెట్రోల్ బంక్ వద్ద ఇంధనం కోసం వాహనదారుల మధ్య కుమ్ములాట జరగడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పెట్రోలియం ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయని ప్రభుత్వం భరోసా ఇస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉందని వినియోగదారులు వాపోతున్నారు. యుద్ధ వాతావరణం సాకుగా చూపి బంకు యజమానులే కావాలని కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని పలువురు ఆరోపించారు. ప్లాస్టిక్ డబ్బాలు, ట్యాంకులతో వందలాది మంది ఎగబడటంతో తోపులాట జరిగి పరిస్థితి అదుపు తప్పింది. ఈ క్రమంలోనే త్రీటౌన్ పోలీసులు సకాలంలో స్పందించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బంకు వద్ద శాంతిభద్రతలను చక్కదిద్దారు.
స్తంభించిన జనజీవనం
సకాలంలో ఇంధనం దొరకకపోవడంతో తమ జీవనశైలి స్తంభించిపోతుందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. “పెట్రోల్, డీజిల్ దొరక్కపోతే మాలాంటి సామాన్య కుటుంబాలు చిన్నభిన్నమవుతాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ కొరతను నివారించాలి” అని వారు డిమాండ్ చేస్తున్నారు. పెట్రోల్ బంకుల వద్ద ఏర్పడ్డ ఈ అకస్మాత్తు రద్దీతో పట్టణంలో రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే దృష్టి సారించి ఇంధన సరఫరాను పునరుద్ధరించాలని పలువురు డ్రైవర్లు, వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు. అనధికారికంగా సృష్టించిన ఈ కొరత వల్ల సామాన్యులు ఇబ్బంది పడుతున్నారని, ప్రభుత్వాలు మొద్దునిద్ర వీడాలని విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి జిల్లావ్యాప్తంగా పెట్రోల్ సరఫరాను క్రమబద్ధీకరించాలని ప్రజలు కోరుతున్నారు.

