డీజిల్ దొరక్క వాహనదారుల అవస్థలు
బంకుల వద్ద బారులు తీరిన జనం
రవాణా, వ్యవసాయ పనులపై తీవ్ర ప్రభావం
కాకతీయ, గీసుగొండ: మండలంలో డీజిల్ కొరత తీవ్రం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండల పరిధిలోని పెట్రోల్ బంకుల్లో డీజిల్ నిల్వలు నిండుకోవడంతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయే పరిస్థితి ఏర్పడింది. డీజిల్ ఎక్కడ దొరుకుతుందో తెలియక వాహనదారులు ఒక బంకు నుంచి మరో బంకుకు తిరుగుతూ నానా అవస్థలు పడుతున్నారు. కొన్ని బంకుల వద్ద డీజిల్ కోసం వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరి కనిపిస్తున్నాయి. డీజిల్ కొరత కారణంగా ముఖ్యంగా సరుకు రవాణా వాహనాలు, ఆటోలు నిలిచిపోయాయి. ప్రస్తుత వ్యవసాయ సీజన్లో ట్రాక్టర్లకు డీజిల్ అత్యవసరమైన తరుణంలో ఈ కొరత ఏర్పడటంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉన్నా ఫలితం లేకపోవడంతో వాహనదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సరఫరాలో ఏర్పడిన సాంకేతిక అంతరాయం కారణంగానే స్టాక్ రాలేదని బంకు నిర్వాహకులు చెబుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి డీజిల్ సరఫరాను పునరుద్ధరించి, తమ ఇబ్బందులను తొలగించాలని మండల ప్రజలు కోరుతున్నారు.

