మక్కల కొనుగోళ్లలో గందరగోళం.. రోడ్డెక్కిన రైతులు
*నర్సంపేట-వరంగల్ ప్రధాన రహదారిపై ధర్నా
కేంద్రాల కొరతపై బీఆర్ఎస్ శ్రేణుల మండిపాటు
గత ప్రభుత్వ విధానాలే ఆదర్శమంటూ నినాదాలు
కాకతీయ, నర్సంపేట టౌన్: మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియలో జాప్యం, అధికారుల సమన్వయ లోపాన్ని నిరసిస్తూ నర్సంపేట రూరల్ మండలంలో బీఆర్ఎస్ శ్రేణులు, రైతులు భారీ ఆందోళనకు దిగారు. నర్సంపేట-వరంగల్ ప్రధాన రహదారిపై గురజాల క్రాస్ వద్ద శనివారం ధర్నా నిర్వహించి ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాస్తారోకోతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి.
*90 వేల ఎకరాల దిగుబడి.. కేవలం 7 కేంద్రాలా?*
నియోజకవర్గవ్యాప్తంగా సుమారు 90 వేల ఎకరాల్లో మొక్కజొన్న దిగుబడి వచ్చినా, కేవలం ఏడు కొనుగోలు కేంద్రాలకే పరిమితం చేయడం రైతుల పట్ల నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆందోళనకారులు మండిపడ్డారు. గతంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హయాంలో 42 కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు అండగా నిలిచారని, ఇప్పుడు ఆ కేంద్రాలను ఎందుకు పునరుద్ధరించడం లేదని ప్రశ్నించారు. తక్షణమే కొనుగోలు కేంద్రాల సంఖ్యను పెంచి మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు.
*సమీక్షలకే పరిమితమైన యంత్రాంగం..*
మార్కెటింగ్ శాఖ, గోదాములు, రవాణా వ్యవస్థల మధ్య సరైన సమన్వయం లేకపోవడం వల్లే కొనుగోళ్లు నిలిచిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు కేవలం సమీక్షా సమావేశాలకే పరిమితమవుతున్నారని, క్షేత్రస్థాయిలో రైతుల కష్టాలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. దళారులు, ప్రైవేట్ వ్యాపారులకు లబ్ధి చేకూర్చేలా ప్రభుత్వ తీరు ఉందంటూ ఆరోపించారు.
*మద్దతు ధర కోసం పట్టు..*
పీఏసీఎస్, ఎఫ్పీఓలు, ఐకేపీ మహిళా సంఘాల ద్వారా మరిన్ని కేంద్రాలు ప్రారంభించాలని, రైతులకు ఇబ్బంది కలగకుండా మక్కలను వెంటనే సేకరించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కోఆర్డినేటర్, మండల, పట్టణ పార్టీ బాధ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు, రైతు సంఘాల ప్రతినిధులు మరియు బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

