మొలంగూర్లో ఉచిత అంబలి కేంద్రం ప్రారంభం
వేసవి తాపం నుంచి ఉపశమనం కల్పించేలా ఏర్పాట్లు
ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ
వెలుగునీడ స్వచ్ఛంద సంస్థ సేవలు అభినందనీయం
కాకతీయ, శంకరపట్నం: వేసవి ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజల దాహార్తిని తీర్చేందుకు శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామంలో సోమవారం ఉచిత అంబలి కేంద్రాన్ని ప్రారంభించారు. వెలుగునీడ స్వచ్ఛంద సంస్థ చైర్మన్ మోరే గణేష్-విజయ దంపతుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని మానకొండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బత్తిని శ్రీనివాస్ గౌడ్, మండల అధ్యక్షులు బసవయ్య గౌడ్ పాల్గొని బాటసారులకు, స్థానిక ప్రజలకు అంబలిని పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే కవ్వంపల్లి మాట్లాడుతూ.. వెలుగునీడ స్వచ్ఛంద సంస్థ గత ఐదేళ్లుగా మొలంగూర్ గ్రామంలో నిరంతరాయంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుండటం హర్షణీయమన్నారు. ముఖ్యంగా భానుడి భగభగలకు అల్లాడుతున్న ప్రజలకు చల్లని అంబలి, తాగునీరు అందించడం గొప్ప విషయమని కొనియాడారు.ప్రజా సేవే లక్ష్యంగా పని చేస్తున్న ఇలాంటి సంస్థలకు తమ వంతు సహకారం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు, మహిళలు, యువకులు మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.

