వారం రోజుల్లో ధాన్యం సేకరణ పూర్తవ్వాలి
రైస్ మిల్లర్లు, లారీ అసోసియేషన్లు సహకరించాలి
రూ.237.39 కోట్ల నిధులు రైతుల ఖాతాల్లో జమ
కలెక్టరేట్ సమీక్షలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశం
కాకతీయ, కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన వారం రోజుల్లో పూర్తి చేయాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో వరి ధాన్యం, మొక్కజొన్న సేకరణ, రవాణా ఇబ్బందులపై ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, కలెక్టర్ చిత్రా మిశ్రా, సీపీ గౌస్ ఆలం, రైస్ మిల్లర్లు, లారీ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు రోజుల తరబడి వేచి ఉండే పరిస్థితి రాకుండా చూడాలని మంత్రి స్పష్టం చేశారు. జిల్లాలో ఈ సీజన్కు 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకోగా.. 314 కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటికే లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం వచ్చిందని మంత్రి తెలిపారు. ఇందులో 1.58 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు పూర్తయిందని, మిగిలిన 1.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని వారంలోగా సేకరించాలన్నారు. ఇప్పటివరకు కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి 63 శాతం మేరకు రూ.237.39 కోట్లను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశామని వెల్లడించారు.
అన్లోడింగ్ ఆలస్యంపై ఆగ్రహం
ధాన్యం రవాణాలో ఇబ్బందులు తలెత్తకుండా లారీల సంఖ్యను పెంచాలని మంత్రి సూచించారు. మిల్లుల్లో అన్లోడింగ్ ఆలస్యం కావడం వల్ల లారీలు రెండు రోజుల పాటు నిలిచిపోతున్నాయని, రోజుకు 150 లారీలు అందుబాటులో ఉన్నా మిల్లుల వద్ద వేగం లేకపోవడం వల్ల రవాణా వ్యవస్థ దెబ్బతింటోందని మండిపడ్డారు. మిల్లర్లు అదనపు హమాలీలను ఏర్పాటు చేసుకుని దిగుమతిని వేగవంతం చేయాలన్నారు. బీహార్ హమాలీలపైనే కాకుండా స్థానిక హమాలీలను కూడా వినియోగించుకోవాలని సూచించారు. సిబ్బంది కొరత ఉన్న ప్యాక్స్ కేంద్రాల కంటే మహిళా సంఘాలు నిర్వహించే ఐకేపీ కేంద్రాలను ప్రోత్సహించాలని మంత్రి పేర్కొన్నారు. పంచాయతీ కార్యదర్శులు, ఏఈవోల నుంచి మొదలుకొని జిల్లా స్థాయి సివిల్ సప్లయ్స్, రెవెన్యూ, పోలీస్, రవాణా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. జిల్లాలో సన్న బియ్యం కొరత రాకుండా ఉండేందుకు వీలుగా, రైతులు సన్న ధాన్యం సాగు పెంచేలా వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు.

