సీపీ వర్సెస్ ఎమ్మెల్యే
ఎల్ఎండీ స్టేషన్లో స్తంభించిన పాలన
నాలుగు నెలలుగా ఇన్చార్జ్ చేతిలోనే పీఎస్ నిర్వహణ
బదిలీపై వచ్చినా.. రెండు వారాలుగా బాధ్యతలు చేపట్టని సీఐ రమేశ్
గతంలో సబ్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్పై చర్యలే వివాదానికి ప్రధాన కారణమా..?
ఈ స్టేషన్లో పోస్టింగ్ అంటేనే వెనకడుగు వేస్తున్న అధికారులు
కాకతీయ,కరీంనగర్ : కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఎల్ఎండీ పోలీస్ స్టేషన్ ప్రస్తుతం పోలీస్, రాజకీయ వర్గాల్లో హాట్టాపిక్గా మారింది. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మధ్య నెలకొన్న ప్రచ్ఛన్న యుద్ధం నేడు స్టేషన్ పరిపాలనను కుంటుపడేలా చేసింది. ఇద్దరు పెద్దల పంతాల మధ్య పోలీస్ స్టేషన్కు పూర్తి స్థాయి అధికారి కరువవ్వడంతో శాంతిభద్రతల పర్యవేక్షణ ప్రశ్నార్థకంగా మారింది. గతంలో ఎల్ఎండీ స్టేషన్లో పనిచేసిన సబ్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్పై ఉన్నతాధికారులు క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం ఈ వివాదానికి బీజం వేసింది. ఈ చర్యలపై స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ బహిరంగంగానే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ పోలీస్ కమిషనర్ తీరును తప్పుపట్టారు. నాటి నుంచి ఇరుపక్షాల మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఈ అంతర్గత పోరు ప్రభావమే ఇప్పుడు నేరుగా పోలీస్ స్టేషన్ నియామకాలపై పడుతోంది.

బదిలీ అయినా.. కుర్చీ ఖాళీనే!
ఇటీవల ఎల్ఎండీ పోలీస్ స్టేషన్కు బదిలీపై వచ్చిన సర్కిల్ ఇన్స్పెక్టర్ బొల్ల రమేశ్ రెండు వారాలు దాటుతున్నా ఇప్పటివరకు బాధ్యతలు చేపట్టకపోవడం కమిషనరేట్లో చర్చనీయాంశమైంది. సాధారణంగా బదిలీ ఉత్తర్వులు రాగానే బాధ్యతలు స్వీకరించాల్సి ఉండగా.. ఇక్కడ జాప్యం జరగడం వెనుక రాజకీయ ఒత్తిళ్లే కారణమనే ఆరోపణలు వస్తున్నాయి. ఫలితంగా గత నాలుగు నెలలుగా ఈ పోలీస్ స్టేషన్ పూర్తి స్థాయి సర్కిల్ ఇన్స్పెక్టర్ లేక, కేవలం ఇన్చార్జ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలోనే సాగుతోంది. దీనివల్ల కీలకమైన కేసుల దర్యాప్తు, సిబ్బంది సమన్వయం లోపించి బాధితులకు న్యాయం జరగడం లేదు.
పోస్టింగ్ అంటేనే జంకు..
ఎల్ఎండీ స్టేషన్లో మితిమీరిన రాజకీయ జోక్యం, ఒత్తిళ్లు ఎక్కువగా ఉన్నాయనే ప్రచారం పోలీస్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో అక్కడికి వెళ్లేందుకు అధికారులు తీవ్రంగా ఆలోచిస్తున్నారు. ఆ పోలీస్ స్టేషన్కు పోస్టింగ్ అంటేనే అధికారులు వెనకడుగు వేస్తున్నారని సిబ్బందే బహిరంగంగా చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ రాజకీయాన్ని పక్కనబెట్టి, స్టేషన్కు పూర్తి స్థాయి సర్కిల్ ఇన్స్పెక్టర్ను నియమించాలని స్థానికులు కోరుతున్నారు.

