50 రోజులైనా ధాన్యం కొనరా?
వేములవాడ రోడ్డుపై రైతుల రాస్తారోకో
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రహదారిపై బైఠాయింపు
కాకతీయ, వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలో వరి ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న తీవ్ర జాప్యంపై రైతాంగ ఆగ్రహం భగ్గుమంది. ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని ఐకేపీ కేంద్రాలకు తెచ్చి 50 రోజులు గడిచినా కొనుగోలు చేయకపోవడం దారుణమని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మ్యాకల ఎల్లయ్య మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాల వల్ల అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. సోమవారం వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన రైతులు, బీఆర్ఎస్ నాయకులు చందుర్తి మండల కేంద్రంలోని వేములవాడ-కోరుట్ల ప్రధాన రహదారిపై బైఠాయించి భారీ రాస్తారోకో నిర్వహించారు. కలెక్టర్ వచ్చి సమాధానం చెప్పాలంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న ఎస్సై రమేష్ పోలీస్ సిబ్బందితో అక్కడికి చేరుకుని ఆందోళనకారులను బుజ్జగించి ధర్నాను విరమింపజేశారు. అనంతరం రైతులు తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీగా వెళ్లి కార్యాలయం ఎదుట మరోసారి బైఠాయించారు.

తూకాల్లో కోతలు పెట్టవద్దు
గంటకు పైగా సాగిన నిరసన అనంతరం తహసీల్దార్ లైసెట్టి భూపతి, ఏపీఎం కళ్యాణిలకు రైతులు వినతిపత్రం అందజేశారు. తూకాల్లో ఎలాంటి కోతలు లేకుండా వారం రోజుల్లో కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మ్యాకల ఎల్లయ్య మాట్లాడుతూ.. వరి కోసి రోజులు గడుస్తున్నా కొనుగోళ్లు జరగకపోవడంతో రైతులు కల్లాల వద్దే నిద్రలేని రాత్రులు గడుపుతున్నారన్నారు. ఎండల తీవ్రతకు ధాన్యం ఎండిపోయి క్వింటాలుకు 10 కిలోల వరకు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాలు రాకముందే కొనుగోళ్లు వేగవంతం చేయాలని, లేనిపక్షంలో రైతుల పక్షాన ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు మరాటి మల్లిక్, ఫ్యాక్స్ చైర్మన్ తిప్పని శ్రీనివాస్, డప్పుల అశోక్, ఏనుగుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

