అక్రమ మోటార్ల దందా.. అన్నదాతల గుండెల్లో మంట…!
నిబంధనలకు విరుద్ధంగా 7.5 హెచ్పీ మోటార్ల అడ్డగోలు వినియోగం
ఓల్టేజ్ సమస్యలతో కాలిపోతున్న తోటి సామాన్య రైతుల మోటార్లు
ప్రతి నాలుగు నెలలకోసారి రూ. 5000 రిపేర్ ఖర్చుతో పేద రైతు విలవిల
అధికారుల మామూళ్ల మత్తు వల్లే అక్రమ వ్యవహారమా? రైతుల తీవ్ర ఆగ్రహం
తనిఖీలకు వస్తున్నారని తెలిసి మోటార్పై లేబుల్ మాయం
కాకతీయ, మణుగూరు టౌన్ : వ్యవసాయ రంగానికి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా కల్పిస్తున్న ఉచిత విద్యుత్ పథకాన్ని కొందరు స్వార్థపరులు అడ్డగోలుగా దుర్వినియోగం చేస్తూ, తోటి అన్నదాతల పొట్ట కొడుతున్నారు. నిబంధనల ప్రకారం వ్యవసాయ కనెక్షన్లకు అనుమతించిన పరిమితి కంటే ఎంతో ఎక్కువ సామర్థ్యం ఉన్న భారీ మోటార్లను అక్రమంగా వాడుతూ సామాన్య, పేద రైతులను తీవ్ర నష్టాల్లోకి నెట్టేస్తున్నారు. విద్యుత్ శాఖ కిందిస్థాయి సిబ్బంది కళ్లు గప్పి లేదా అధికారుల పరోక్ష సహకారంతోనే ఈ అక్రమ దందా నెలల తరబడి సాగుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
తోటి రైతులకు శాపంగా మారిన భారీ మోటార్లు
మణుగూరు పరిధిలో ఉన్న ఒక అనామక వ్యక్తి నిబంధనలకు పూర్తిగా విరుద్ధంగా ఏకంగా 7.5 హెచ్పీ (హార్స్ పవర్) సామర్థ్యం గల భారీ మోటారును నడుపుతున్నట్లు తాజాగా తేలింది. చట్టబద్ధంగా అనుమతించిన పరిమితి కంటే ఇది ఎంతో ఎక్కువ. ఈ ఒక్క భారీ మోటార్ కారణంగా ఆ పరిధిలోని వ్యవసాయ విద్యుత్ లైన్లపై తీవ్రమైన లోడ్ పడి, ఓల్టేజ్ ఒడిదుడుకులు నిత్యకృత్యంగా మారాయి. ఫలితంగా, చుట్టుపక్కల ఉన్న తోటి రైతుల సాధారణ మోటార్లు ప్రతి 4 నెలలకోసారి కాలిపోతున్నాయి. ఒక్కోసారి మోటార్ రిపేర్ కావడానికి, కాయిల్ వైండింగ్ చేయించడానికి పేద రైతులు అప్పులు తెచ్చి రూ.5,000 వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఏడాదికి మూడు నాలుగు సార్లు ఇలా మోటార్లు కాలిపోతుండటంతో పెట్టుబడి ఖర్చులు భారమై, అప్పులపాలువుతున్నామని స్థానిక రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు.
విద్యుత్ శాఖ నిద్రపోతోందా?.. అధికారుల గుట్టురట్టు!
గడిచిన కొన్ని నెలలుగా ఈ అక్రమ వ్యవహారం బహిరంగంగానే సాగుతున్నా, స్థానిక విద్యుత్ శాఖ అధికారులు కనీసం అటువైపు కన్నెత్తి చూడకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సదరు వ్యక్తి శాఖ అనుమతి లేకుండా అంత పెద్ద మోటార్ను ఎలా మేనేజ్ చేస్తున్నాడు? లైన్మెన్ మొదలుకుని పై అధికారుల వరకు అందుతున్న మామూళ్ల మత్తు వల్లే ఈ అక్రమాలను పట్టించుకోవడం లేదా? అసలు విద్యుత్ శాఖ పనితీరు ఇలాగేనా ఉండేది? అంటూ బాధితులు గట్టిగా నిలదీస్తున్నారు. రైతుల నుంచి నిరసనలు, ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఎట్టకేలకు ఈరోజు విద్యుత్ శాఖ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చారు. సదరు వ్యక్తి పొలంలో తనిఖీలు చేపట్టగా, అక్కడ నడుస్తున్న మోటార్ను చూసి అధికారులు సైతం విస్మయం చెందారు. అయితే, అధికారుల తనిఖీల సమాచారం ముందే లీక్ కావడంతో పక్కా ప్రణాళికతోనే ఆ మోటార్పై ఉండాల్సిన కంపెనీ లేబుల్ (స్పెసిఫికేషన్ స్టిక్కర్)ను పూర్తిగా తొలగించారు. మోటార్ సామర్థ్యం హెచ్పీ ఎంత ఉందో అధికారులకు స్పష్టంగా తెలియకుండా చేసేందుకే ఈ లేబుల్ను తీసేసినట్లు స్పష్టమవుతోంది.
సబ్స్టేషన్ ముట్టడిస్తాం: రైతుల హెచ్చరిక
మోటార్పై లేబుల్ లేకపోయినా దాని సైజు, అది లాగుతున్న కరెంట్ లోడ్ను బట్టి అది 7.5 హెచ్పీ భారీ మోటార్ అని స్పష్టంగా అర్థమవుతోందని రైతులు చెబుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, సదరు అక్రమ కనెక్షన్ను వెంటనే తొలగించడమే కాకుండా సదరు వ్యక్తిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఇన్నాళ్లూ నిర్లక్ష్యంగా వ్యవహరించి, అక్రమార్కుడికి కొమ్ముకాసిన స్థానిక లైన్మెన్, అధికారులపై శాఖాపరమైన విచారణ జరపాలని కోరుతున్నారు. లేనిపక్షంలో మణుగూరు విద్యుత్ సబ్స్టేషన్ ఎదుట ఎద్దుల బండ్లతో పెద్ద ఎత్తున ఆందోళనలు, ధర్నాలు నిర్వహిస్తామని రైతులు హెచ్చరించారు.

