మామిడి తోటల్లో హైటెన్షన్ వైర్ల మంటలు
నాలుగు టన్నుల పంట దగ్ధం
గాలి దుమారంతో ఒకదానికొకటి తాకిన విద్యుత్ తీగలు
ఇల్లంతకుంట మండలం చిక్కుడువాని పల్లెలో ఘటన
కాకతీయ, ఇల్లంతకుంట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం చిక్కుడువాని పల్లె గ్రామంలో శనివారం ప్రమాదవశాత్తు భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గ్రామ శివారులోని ఓ మామిడి తోట సమీపంలో ఉన్న విద్యుత్ హైటెన్షన్ వైర్లు గాలి దుమారానికి ఒక్కదానిపై ఒకటి తాకడంతో ఒక్కసారిగా నిప్పురవ్వలు ఎగసిపడి మంటలు చెలరేగాయి. ఈ మంటలు పక్కనే ఉన్న మామిడి తోటలకు వేగంగా వ్యాపించడంతో కోతకు సిద్ధంగా ఉన్న మామిడికాయలు, చెట్లు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న స్థానిక సర్పంచ్ చింతమడక కళ్యాణ్, ఉపసర్పంచ్ చిక్కుడు సత్యం, గ్రామస్థులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని మంటలను ఆర్పేందుకు శ్రమించారు. అలాగే పోలీస్ కానిస్టేబుల్ రాధారపు సురేష్, జీపీఓ రాజు, యువజన సంఘాల సభ్యులు నీటి ట్యాంకర్ను అక్కడికి తీసుకొచ్చి మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారు.
గాలికి ఎగసిపడిన మంటలు
వేసవి కాలం కావడంతో ఎండ తీవ్రత, ఈదురుగాలుల వల్ల మంటలు క్షణాల్లో తోట అంతటా విస్తరించాయి. మంటలు ఆర్పేలోపే తోటలోని చెట్లు, కోత దశకు వచ్చిన మామిడి పంటకు భారీ నష్టం వాటిల్లింది. ఈ ప్రమాదంలో సుమారు నాలుగు టన్నుల మేర మామిడి పంట పూర్తిగా కాలి బూడిదైనట్లు రైతు, సర్పంచ్ మామిడి కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి కంటికి రెప్పలా కాపాడుకున్న తోట కండ్ల ముందే బూడిదవడంతో రైతు కన్నీరుమున్నీరయ్యాడు. గ్రామ శివార్లలో జోలాడుతున్న హైటెన్షన్ విద్యుత్ తీగలను సరిచేయకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి వేలాడుతున్న తీగలను సరిచేయాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి నష్టపోయిన మామిడి రైతును ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

