పెండింగ్ డీఏలు వెంటనే విడుదల చేయాలి
నూతన పీఆర్సీని ప్రకటించాలని టాప్రా డిమాండ్
కాకతీయ, కరీంనగర్/హుజురాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లకు నూతన పీఆర్సీని వెంటనే ప్రకటించాలని, పెండింగ్లో ఉన్న డీఏలను విడుదల చేయాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ (టాప్రా) కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు చందుపట్ల జనార్దన్ డిమాండ్ చేశారు. హుజురాబాద్లోని సంఘ కార్యాలయంలో నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. 2023 జూలై 1 నాటికి అమలులో ఉన్న డీఏను విలీనం చేస్తూ కొత్త పీఆర్సీని ప్రకటించి, అదే తేదీ నుంచి అమలు చేయాలని కోరారు. ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ ట్రస్ట్ (ఈహెచ్ఎస్) అమలుపై స్పష్టమైన మార్గదర్శకాలు లేకుండానే ఈ నెల 31లోగా వివరాలు సమర్పించాలని కోరడం వల్ల పెన్షనర్లు గందరగోళానికి గురవుతున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే పూర్తి మార్గదర్శకాలు విడుదల చేసి, ఈహెచ్ఎస్ ప్రీమియం ఒక శాతానికి మించకుండా చూడాలని కోరారు. పెన్షనరీ బకాయిలు, ఇతర పెండింగ్ బిల్లులను తక్షణమే మంజూరు చేయాలన్నారు. సమావేశంలో టాప్రా హుజురాబాద్ యూనిట్ అధ్యక్షుడు భారత ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి చీకట్ల సమ్మయ్య, కోశాధికారి మండల వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.

