హుజురాబాద్కు జలగండం
పట్టణంలో తాగునీటి సమస్యకు అధికారులే కారణం
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆగ్రహం
కాకతీయ, హుజురాబాద్ : హుజురాబాద్ పట్టణంలో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొనడంపై స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజురోజుకూ పెరుగుతున్న ఎండల తీవ్రతకు తోడు పట్టణంలో తాగునీటి సమస్య మరింత విషమంగా మారిందని, ప్రజలు నీటి కోసం అల్లాడిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో నిరంతరాయంగా సాగిన నీటి సరఫరా ప్రస్తుతం దెబ్బతినడం మున్సిపల్ అధికారుల, పరిపాలనా వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. పట్టణానికి రోజుకు 60 నుంచి 70 లక్షల లీటర్ల నీరు అవసరముండగా.. ప్రస్తుతం కేవలం 38 లక్షల లీటర్ల సరఫరాకే పరిమితం చేశారని కౌశిక్ రెడ్డి ఎండగట్టారు. ఫలితంగా అనేక కాలనీల్లో మహిళలు, వృద్ధులు గంటల తరబడి బిందెలతో నీటి కోసం ఎదురుచూడాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. కనీసం ట్యాంకర్ల ద్వారా కూడా తగిన స్థాయిలో నీరు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి హుజురాబాద్కు పూర్తి స్థాయిలో నీటి సరఫరాను పునరుద్ధరించేందుకు అత్యవసర చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, ప్రతి కాలనీకి నీటి ట్యాంకర్లు ఏర్పాటు చేసి నిరంతరంగా నీరందించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ప్రజల తాగునీటి సమస్యపై తాము నిరంతరం పోరాడుతామని, అవసరమైతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.

