జూన్ 4 డెడ్ లైన్
ధాన్యం సేకరణలో ఆ తేదీ మించొద్దు
ధాన్యంతో పాటు మొక్కజొన్న కొనుగోళ్లను పూర్తి చేయాలి
తాలు, తరుగు పేరుతో రైతులను ఇబ్బంది పెడితే మిల్లర్లపై కఠిన చర్యలు
గన్నీ సంచుల కొరత లేదు.. ప్రతి గింజను కొనుగోలు చేయాలి
తడిసిన ధాన్యాన్ని కూడా కనీస మద్దతు ధరకే కొని మిల్లులకు తరలించాలి
అధికారులకు మంత్రులు ఉత్తమ్, పొంగులేటి ఆదేశాలు
ధాన్యం,మొక్కజొన్న కొనుగోళ్లపై ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయిలో సమీక్ష
రైతులు అధైర్య పడొద్దు.. ప్రభుత్వం అండగా ఉంటుదని భరోసా
కాకతీయ, వరంగల్ బ్యూరో : ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియను జూన్ 4వ తేదీలోగా సంపూర్ణంగా పూర్తి చేయాలని రాష్ట్ర పౌర సరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. గురువారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆయన ధాన్యం కొనుగోళ్లపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. వాతావరణ శాఖ జూన్ 4వ తేదీ తర్వాత వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించిన నేపథ్యంలో, జూన్ 3వ తేదీ నాటికే ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లు పూర్తి చేయాలని కలెక్టర్లకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. రాష్ట్రంలో గన్నీ సంచుల కొరత లేదని, ఈ యాసంగి సీజన్కు అవసరమైన 24 కోట్ల గన్నీ సంచులను కొనుగోలు కేంద్రాల వద్ద సిద్ధంగా ఉంచామని తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యంలో తాలు, తరుగు పేరుతో కోతలు విధించే మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కూడా కనీస మద్దతు ధరకే కొనుగోలు చేసి వెంటనే బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలిస్తున్నామని, ప్రభుత్వానికి సహకరించే రైస్ మిల్లర్లకు అదనపు బాయిల్డ్ రైస్ టార్గెట్లు కేటాయిస్తామని వెల్లడించారు.

రవాణాకు ఇసుక లారీల మళ్లింపు
ధాన్యం రవాణాను వేగవంతం చేసేందుకు ఇసుక రవాణాకు వినియోగిస్తున్న లారీలను తాత్కాలికంగా కొనుగోలు కేంద్రాలకు మళ్లించాలని మంత్రి సూచించారు. అవసరమైతే లారీలు, డీసీఎంలను రిక్విజిషన్ చేసి ధాన్యం తరలింపునకు వినియోగించాలని ఎస్పీలు, ఆర్టీఏ అధికారులను ఆదేశించారు. జిల్లాల వారీగా గోదాములలో నిల్వ స్థలాల కేటాయింపుపై పౌర సరఫరాల కమిషనర్ సమన్వయం చేసుకోవాలన్నారు. జనగామ జిల్లా ధాన్యానికి యాదాద్రిలో, వరంగల్ జిల్లా ధాన్యానికి భూపాలపల్లిలో నిల్వ స్థలాలు కేటాయించాలని, అవసరమైతే ప్రైవేట్ గోదాములను కూడా వినియోగించుకోవాలని కలెక్టర్లకు తెలిపారు.
రూ. 10,500 కోట్ల చెల్లింపులు పూర్తి
ఈ యాసంగి సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడమే లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటివరకు 58 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 8.5 లక్షల మంది రైతులకు రూ. 10,500 కోట్ల చెల్లింపులు పూర్తి చేశామన్నారు. కేంద్రం కొనుగోలు చేసినా చేయకపోయినా రైతుల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొంటుందని స్పష్టం చేశారు. అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఆర్డీవోలు, సివిల్ సప్లై, రవాణా, పోలీస్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని, ఒక్క గింజ కూడా మిగలకుండా కొనుగోలు చేసే బాధ్యతను కలెక్టర్లు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఫైనాన్స్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, గండ్ర సత్యనారాయణ రావు, కె.ఆర్. నాగరాజు, పాడి కౌశిక్ రెడ్డి, పౌర సరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, హన్మకొండ, వరంగల్, ములుగు, జనగామ జిల్లాల కలెక్టర్లు చాహాట్ బాజ్పాయ్, డాక్టర్ సత్య శారద, బొర్ఖడే హేమంత్ సహదేవ్ రావు, సందీప్ కుమార్ ఝా తదితరులు పాల్గొన్నారు.

