డీసిల్టేషన్ పేరుతో ఇసుక అక్రమాలు
బరాజ్ లేకుండా డీసిల్టేషన్
15 రోజుల్లో అనుమతులు ఎలా
ఇసుక వ్యవహారంపై సతీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
కాకతీయ, ములుగు ప్రతినిధి:ములుగు జిల్లాలో గత కొద్ది రోజులుగా అధికార పార్టీ నాయకులకు మరియు బిఆర్ఎస్ నాయకులకు మధ్య జరుగుతున్న ఇసుక వివాదం పై మంగళవారం ములుగు జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ తో సమావేశమైన బిఆర్ఎస్ నాయకులు సమావేశం అనంతరం బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్చార్జ్ వై సతీష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. జిల్లాలో జరుగుతున్న ఇసుక తవ్వకాల వ్యవహారం పై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ, ఇది కుంభకోణమా కాదా అన్నది ప్రజలే తేల్చాలని విజ్ఞప్తి చేశారు. మీడియా ప్రతినిధులు కూడా ఈ అంశాన్ని పరిశీలించి ప్రజలకు నిజాలను తెలియజేయాలని కోరారు. ఈ సందర్భంగా సతీష్ రెడ్డి మాట్లాడుతూ డీసిల్టేషన్ అనే ప్రక్రియను తప్పుగా చూపిస్తూ అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి అని ఆరోపించారు. సాధారణంగా డీసిల్టేషన్ అనేది బరాజ్లు లేదా చెక్డ్యామ్ల వద్ద నీటి నిల్వ సామర్థ్యం తగ్గినప్పుడు పేరుకుపోయిన ఇసుకను తొలగించేందుకు మాత్రమే చేపట్టాల్సిన ప్రక్రియ అని అయితే సీతమ్మ సాగర్ బ్యారేజ్ కు దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో మంగపేట ప్రాంతంలో బరాజ్ లేకపోయినా ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇవ్వడం అనుమానాస్పదమని అన్నారు. బరాజ్ లేకుండా డీసిల్టేషన్ పేరుతో ఇసుక తవ్వకాలు చేయడం ఎలా సమంజసం అని ప్రశ్నించారు. ఇక జిల్లాలో ఇప్పటికే ఉన్న 50 నుంచి 100 వరకు ప్రైవేట్ ఇసుక క్వారీలను నిలిపివేయడం వెనుక కూడా కుట్ర ఉందని ఆరోపించారు. ఇసుకకు కృత్రిమ కొరత సృష్టించి, కొంతమంది లాభపడేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఈ క్వారీల్లో పెట్టుబడులు పెట్టిన స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అనుమతుల మంజూరులో జరిగిన వేగంపై కూడా సతీష్ రెడ్డి అనుమానాలు వ్యక్తం చేశారు. సాధారణంగా ఇలాంటి అనుమతులకు సంవత్సరాల సమయం పట్టే పరిస్థితిలో, కేవలం 15 రోజుల్లోనే అన్ని అనుమతులు రావడం వెనుక ఉన్న కారణాలను ప్రభుత్వం వెల్లడించాలని డిమాండ్ చేశారు. మంత్రుల ప్రమేయం లేకుండా ఇంత వేగంగా అనుమతులు రావడం సాధ్యమేనా అని ప్రశ్నించారు. మార్చి 25న చీఫ్ ఇంజనీర్ లేఖతో ప్రారంభమైన ప్రక్రియ, ఏప్రిల్లో వివిధ శాఖల నుంచి వరుసగా లేఖలు, జాయింట్ ఇన్స్పెక్షన్ కమిటీ, జిల్లా స్థాయి సాండ్ కమిటీ (డీఎల్ఎస్సీ) సమావేశం, గ్రామ సభల ఆమోదం తెలపడం వరకు ఈ ప్రక్రియలు అత్యంత వేగంగా పూర్తయ్యాయని ఆయన పేర్కొన్నారు. రెండు సంవత్సరాలుగా డీఎల్ఎస్సీ సమావేశాలు జరగకపోయినా అకస్మాత్తుగా మూడు రోజుల్లోనే సమావేశం జరిపి ఆమోదాలు ఇవ్వడం అనుమానాస్పదమని అన్నారు.
పీసా చట్టం ప్రకారం గ్రామ సభల ఆమోదం తప్పనిసరి అయినప్పటికీ, నోటీసు ఇచ్చిన వెంటనే మూడు రోజుల్లోనే గ్రామ సభలు నిర్వహించి నివేదికలు సమర్పించడం కూడా ప్రశ్నార్థకమని విమర్శించారు. ఈ మొత్తం వ్యవహారం సుమారు రూ. 4000 కోట్ల కుంభకోణంగా అభివర్ణించిన సతీష్ రెడ్డి ఈ మొత్తం డబ్బును ములుగు నియోజకవర్గంలోని కుటుంబాలకు పంచితే ప్రతి కుటుంబానికి రూ. 4 లక్షలు అందించవచ్చు అని అన్నారు. ప్రజల సొమ్మును దోచుకునే ప్రయత్నం జరుగుతోందని ఆరోపిస్తూ, ప్రభుత్వం దీనిపై స్పష్టమైన వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
చివరగా తాము వ్యక్తిగత విమర్శలు చేయడం కాదని, ప్రజల తరఫున ప్రశ్నిస్తున్నామని పేర్కొంటూ ఈ అంశంపై ప్రజలు స్పందించాలని, నిజానిజాలు బయటపడేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ములుగు నియోజకవర్గ ఇన్చార్జ్ బడే నాగజ్యోతి, ములుగు మండల అధ్యక్షుడు రమేష్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

