ఎంపీడీవోగా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాసులు
మండల అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి
నూతన అధికారికి స్వాగతం పలికిన సిబ్బంది, ప్రజాప్రతినిధులు
కాకతీయ, రాయపర్తి: రాయపర్తి మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో)గా పాక శ్రీనివాసులు గురువారం బాధ్యతలు స్వీకరించారు. గీసుకొండ మండలంలో మండల పంచాయతీ అధికారిగా విధులు నిర్వహించి, పదోన్నతిపై ఆయన రాయపర్తి ఎంపీడీవోగా నియమితులయ్యారు. గతంలో ఇక్కడ పనిచేసిన గుగులోత్ కిషన్ నాయక్ హనుమకొండ జిల్లా వేలేరు మండలానికి బదిలీపై వెళ్లడంతో, ఆ స్థానంలో శ్రీనివాసులు బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం శ్రీనివాసులు మాట్లాడుతూ, మండల అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు. మండలంలో పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపుతానని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చూస్తానని తెలిపారు. ప్రజాప్రతినిధులు, కార్యాలయ సిబ్బంది సహకారంతో రాయపర్తిని ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్తామని, ప్రజలకు, రైతులకు నిరంతరం అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి కూచన ప్రకాష్, సర్పంచులు చెవ్వు కాశినాధం, గుగులోత్ అక్రీ రాంజీ నాయక్, మోహన్ లాల్, పంచాయతీ కార్యదర్శులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. నూతన ఎంపీడీవోకు వారు పుష్పగుచ్చాలు అందజేసి, శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.

