హిందువుల ఓట్ల తొలగింపునకు కుట్ర
అప్పులు, అవినీతే కాంగ్రెస్–బీఆర్ఎస్ పాలనల ప్రత్యేకత
కేంద్ర నిధులతోనే తెలంగాణలో అభివృద్ధి
కేంద్ర మంత్రి బండి సంజయ్
వేములవాడలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం
డబుల్ ఇంజిన్ సర్కార్ రావాల్సిన అవసరం ఉందని పిలుపు
కాకతీయ, వేములవాడ : ఎస్ఐఆర్ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని, హిందువుల ఓట్లను తొలగించేందుకు కుట్ర పన్నుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో ఆరోపించారు. అధికారులకు ప్రభుత్వం సహకరించకపోవడంతో క్షేత్రస్థాయిలో ప్రక్రియ సక్రమంగా జరగడం లేదని, ఇదే పరిస్థితి కొనసాగితే తెలంగాణలో హిందువులే మైనారిటీలయ్యే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. మజ్లిస్తో కుమ్మక్కై కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఓట్ల తొలగింపు ప్రక్రియను ముందుకు తీసుకెళ్తోందని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు కలిసి దాదాపు రూ.10 లక్షల కోట్ల అప్పు చేసి తెలంగాణ ప్రజలపై భారాన్ని మోపాయని బండి సంజయ్ ఆరోపించారు. ఇంత భారీ అప్పులు చేసినా, ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, ఫీజు రీయింబర్స్మెంట్, కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లించలేని దుస్థితిలో రాష్ట్రం ఉందని, ఆర్థిక పరిస్థితి ఇలాగే కొనసాగితే శ్రీలంక, పాకిస్తాన్ తరహా సంక్షోభం వచ్చే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం విడుదల చేస్తున్న ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లిస్తోందని ఆయన విమర్శించారు.

కేంద్ర నిధులతోనే అభివృద్ధి
వేములవాడ నియోజకవర్గ పర్యటనలో భాగంగా మేడిపల్లి, భీమారం, కథలాపూర్ మండలాల్లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఆయన, కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధి కోసం గత ఏడేళ్లలో రూ.22 వేల కోట్లకు పైగా కేంద్ర నిధులు తీసుకొచ్చామని తెలిపారు. ఇందులో రూ.10 వేల కోట్లు రహదారుల నిర్మాణానికే ఖర్చు చేశామని, కరీంనగర్–వరంగల్ జాతీయ రహదారి పనులు దసరా నాటికి పూర్తవుతాయని వెల్లడించారు. ఎన్నికల అనంతరం తన లక్ష్యం కేవలం అభివృద్ధేనని, అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు రాజకీయాలకు అతీతంగా కలిసి పనిచేస్తే నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దవచ్చని అన్నారు.
వీబీజీ రామ్ జీ పథకంపై కోర్టుకు వెళ్లడం దారుణం
గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని బలోపేతం చేసే ‘వీబీజీ రామ్ జీ’ పథకాన్ని అమలు చేయకుండా ప్రభుత్వం కోర్టుకు వెళ్లడంపై ఆయన మండిపడ్డారు. పనిదినాలు పెంచి గ్రామాల్లో శాశ్వత ఆస్తులు సృష్టించడం తప్పా అని ప్రశ్నించిన ఆయన, ప్రధాని మోదీకి మంచి పేరు వస్తుందనే అక్కసుతోనే కొందరు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో ఆర్థిక క్రమశిక్షణ, అవినీతి రహిత పాలన కోసం ‘డబుల్ ఇంజిన్’ ప్రభుత్వం రావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ జీవితానికి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూనే, ఇచ్చిన ఆరు గ్యారంటీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

