13 ఏళ్ల విద్యార్థినిపై తోటి విద్యార్థుల లైంగిక వేధింపులు
పాఠశాల ఆవరణలోనే జరిగిన అఘాయిత్యం
10 మందిని నిందితులుగా చేర్చిన పోలీసులు
కాకతీయ,నేషనల్ డెస్క్ : కేరళలో 13 ఏళ్ల పాఠశాల విద్యార్థినిపై తోటి విద్యార్థులే గత కొన్ని నెలలుగా వరుసగా లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ ఏడాది మే నెలలో ఈ దారుణ సంఘటనలు చోటుచేసుకున్నాయి. పాఠశాల ఆవరణ, పాఠశాల వాష్రూమ్, నిందితుల్లో ఒకరైన బాలిక నివాసంతో సహా పలు ప్రాంతాల్లో ఈ వేధింపులు జరిగినట్లు విచారణలో వెల్లడైంది. ఈ కేసులో ఒక బాలికతో సహా మొత్తం 10 మందిని పోలీసులు నిందితులుగా చేర్చారు. వీరిలో ఆరుగురు మైనర్లు కావడం గమనార్హం.
కౌన్సిలింగ్ సెషన్లో వెలుగులోకి
పాఠశాలలో నిర్వహించిన ఒక మానసిక కౌన్సిలింగ్ సెషన్లో, బాధిత బాలిక తనకు జరిగిన అన్యాయాన్ని, వేధింపులను వివరించడంతో ఈ ఘోరం బయటపడింది. వెంటనే స్పందించిన స్కూల్ సిబ్బంది చైల్డ్లైన్ అధికారులకు సమాచారం అందించారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి బాలిక స్టేట్మెంట్ను రికార్డు చేసి విచారణను వేగవంతం చేశారు.బాధిత బాలికపై వేర్వేరు చోట్ల తోటి విద్యార్థులు పదే పదే వేధింపులకు పాల్పడినట్లు తేలడంతో, పోలీసులు అన్ని కోణాల్లో ఆధారాలను సేకరిస్తున్నారు. దాదాపు 1.5 ఏళ్ల క్రితం ఇదే ప్రాంతంలో జరిగిన మరో లైంగిక దాడి కేసుకు, ఈ ఘటనకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా కేరళ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేసింది. ఈ సంఘటన మరియు దర్యాప్తు పురోగతిపై సమగ్ర నివేదిక సమర్పించాలని పోలీసులను కమిషన్ ఆదేశించింది.

