సుడా పీఠం.. ఎవరికి దక్కేను?
‘పీఠం’ చుట్టూ కరీంనగర్ రాజకీయం
పట్టణాభివృద్ధి సంస్థపై దుద్దిళ్ల పట్టు
సొంత ఇలాఖాలో పట్టు నిలుపుకునేందుకు పొన్నం వ్యూహం
చైర్మన్ రేసులో నయా-పురా నాయకుల హడావిడి
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ రాజకీయాల్లో ఇప్పుడు ‘సుడా’ పీఠం మంట పుట్టిస్తోంది. శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (సుడా) చైర్మన్ పదవీకాలం ముగియడంతో, ఆ కుర్చీని దక్కించుకోవడానికి కాంగ్రెస్ నేతలు వేస్తున్న ఎత్తుగడలు ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్. ఎవరికి వారు అధిష్ఠానం వద్ద లాబీయింగ్లో మునిగిపోతుంటే, జిల్లాలో చక్రం తిప్పుతున్న ఇద్దరు మంత్రుల వర్గాల మధ్య ‘ఆధిపత్యం’ కోసం తెరవెనుక యుద్ధం నడుస్తోంది. ప్రస్తుత చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మరోసారి తన సీటును కాపాడుకోవాలని తెగ తాపత్రయపడుతున్నారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అండదండలతో, మళ్లీ తననే ఆ పీఠంపై కూర్చోబెట్టాలంటూ ఆయన అధిష్ఠానం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయితే, ఈసారి రేసులో కొత్తవారు కూడా గట్టిగానే పోటీపడుతున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మద్దతు తమకే ఉంటుందనే ధీమాతో పలువురు ద్వితీయ శ్రేణి నేతలు కూడా పోటీలో దిగారు. ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి నుంచి కార్పొరేటర్ మల్లికార్జున్ రాజేందర్ వరకు.. ఎవరి లెక్కలు వారివే!
ఇద్దరు మంత్రులు.. రెండు వర్గాలు!
సుడా చైర్మన్ ఎంపిక ఇప్పుడు దుద్దిళ్ల, పొన్నం వర్గాల మధ్య ‘ప్రతిష్టాత్మక’ పోరుగా మారింది. ఇద్దరు మంత్రులు తమ అనుయాయులకే ఆ పదవి దక్కాలని గట్టిగా కోరుకుంటున్నట్లు సమాచారం. సుడా అనేది కేవలం పదవి కాదు.. కరీంనగర్ నగరాభివృద్ధిలో కీలకం కావడంతో.. ఆ పీఠంపై తమ ముద్ర ఉండాలని మంత్రులు భావిస్తున్నారు. ఎవరిని ఆశీర్వదించాలో, ఎవరిని పక్కన పెట్టాలో తేల్చుకోలేక అధిష్ఠానం సతమతమవుతుంటే, వీరు మాత్రం ఎవరి ప్రయత్నాల్లో వారు నిమగ్నమయ్యారు.
అధిష్ఠానం ఎవరికి మొగ్గు చూపుతుంది?
రాజకీయ సమీకరణాలు, సామాజిక వర్గాల బలాబలాలు.. ఇలా ఎన్నో అంశాలను బేరీజు వేసుకుని అధిష్ఠానం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కోమటిరెడ్డిని కొనసాగిస్తారా? లేక కొత్త ముఖానికి అవకాశం ఇచ్చి జిల్లాలో కొత్త సమీకరణాలకు తెరలేపుతారా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఏది ఏమైనా, సుడా పీఠం ఎవరికి దక్కుతుందనేది కరీంనగర్ కాంగ్రెస్లో ఇప్పుడు ‘అగ్నిపరీక్ష’గా మారింది. అధిష్ఠానం తీసుకునే నిర్ణయం.. జిల్లాలో వర్గ పోరుకు చెక్ పెడుతుందా? లేక మరింత నిప్పు రాజేస్తుందా? అని పార్టీ శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

