- కరీంనగర్లో అగ్గిరాజేస్తున్న కాంగ్రెస్ కుంపట్లు!
- ‘సుడా’ పీఠంపై అధిష్ఠానం వద్ద తేలని పంచాయితీ
- జూలై 8తో ముగిసిన పదవీకాలం.. రేసులో ముగ్గురు
- శ్రీధర్బాబు వర్సెస్ వెలిచాల వర్గాల వ్యూహ ప్రతివ్యూహాలు!
- సుడా చైర్మన్ పీఠం కోసం ముమ్మర లాబీయింగ్
- రెన్యువల్ కోసం కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కసరత్తు
- అడ్డుపడుతున్న వెలిచాల రాజేందర్ రావు వర్గం
- సామాజిక సమీకరణాల పేరుతో తెరపైకి కొత్త పేర్లు
- అధిష్ఠానం నిర్ణయంపైనే సర్వత్రా ఉత్కంఠ..
- నియోజకవర్గ ఇన్చార్జిల మధ్యే ప్రధాన పోరు
- ‘సుడా’ కంట్రోల్ ఎవరి చేతుల్లోకి?
కాకతీయ,కరీంనగర్ : కరీంనగర్ శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (సుడా) చైర్మన్ పదవి.. ఇప్పుడు కరీంనగర్ కాంగ్రెస్ రాజకీయాల్లో అత్యంత ‘హాట్’ టాపిక్. పదవీకాలం ముగిసిన వేళ, ఆ పీఠాన్ని దక్కించుకునేందుకు జిల్లా కాంగ్రెస్ నేతల మధ్య జరుగుతున్న కుర్చీలాట రసవత్తరంగా మారింది. ఇక్కడ జరుగుతున్న పోరు కేవలం ఒక పదవికి సంబంధించింది మాత్రమే కాదు, జిల్లా రాజకీయాల్లో ఎవరి ఆధిపత్యం చెల్లుబాటు అవుతుందో తేల్చే ‘పవర్ గేమ్’ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుత చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తన రెండేళ్ల సేవలు, పార్టీకి పట్టు నిలబెట్టడం, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణాభివృద్ధి పనుల్లో చురుగ్గా పాల్గొన్న అంశాలను ప్రాతిపదికగా తీసుకుని, అధిష్ఠానం వద్ద రెన్యువల్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఈయనకు మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు ఆశీస్సులు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, దీనికి ధీటుగా కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు పావులు కదుపుతున్నారు. మార్కెట్ చైర్మన్ నియామకంలో తన పట్టు నిరూపించుకున్న వెలిచాల, ఈసారి తన సన్నిహితుడికి లేదా తన వర్గానికి సుడా పగ్గాలు దక్కేలా అధిష్ఠానాన్ని ఒప్పించే పనిలో ఉన్నారు. మరోవైపు, విద్యావేత్తగా గుర్తింపు ఉన్న అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి కూడా ఎమ్మెల్సీ ఎన్నికల అనుభవాన్ని పెట్టుబడిగా పెట్టి, రేసులో దూసుకెళ్తున్నారు.
సామాజిక సమీకరణాల ‘అస్త్రం’..
సుడా చైర్మన్ నియామకంలో ఈసారి సామాజిక సమీకరణాలు కీలకం కానున్నాయి. రెడ్డి సామాజిక వర్గానికే ప్రాధాన్యత ఇస్తారా, లేక బీసీలకు అవకాశం కల్పిస్తారా అనే చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఒకవేళ బీసీలకు అవకాశం కల్పించాల్సి వస్తే, కార్పొరేటర్ మల్లికార్జున రాజేందర్ పేరును కూడా అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు సమాచారం. నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయాలంటే స్థానిక నాయకత్వానికి, ముఖ్యంగా ఇన్చార్జిల సిఫార్సులకు విలువ ఇవ్వాల్సిందేనని, అదే సమయంలో సామాజిక సమతుల్యతను కాపాడటం అధిష్ఠానానికి కత్తిమీద సాములా మారింది. పదవి కోసం పోటీ పడుతున్న వారు ఎవరికి వారు తామే సరైన వారమని నిరూపించుకునేందుకు రాష్ట్ర స్థాయి నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
సుడాపై పట్టు ఎవరిది?
కరీంనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్కు ఎమ్మెల్యే లేని నేపథ్యంలో, సుడా చైర్మన్ పదవి కేవలం ఒక నామినేటెడ్ పోస్టు మాత్రమే కాదు, అది నియోజకవర్గంలో ‘పారలల్ పవర్ సెంటర్’. నిధుల కేటాయింపు, అభివృద్ధి పనుల పర్యవేక్షణ వంటి అధికారాలు ఉండటంతో, భవిష్యత్ ఎన్నికల వ్యూహాలకు ఇది పునాదిగా మారుతుంది. మంత్రి శ్రీధర్బాబు వర్గం తన పట్టును నిలబెట్టుకోవాలని చూస్తుంటే, వెలిచాల వర్గం నగరంపై పట్టు సాధించి భవిష్యత్తులో టికెట్ రేసులో ముందుండాలని ప్రయత్నిస్తోంది. ఈ నియామకం ఎవరికి దక్కినా, అది కరీంనగర్ కాంగ్రెస్ అంతర్గత సమీకరణాలను పూర్తిగా మార్చే అవకాశం ఉంది. ఎవరికీ ప్రాధాన్యం తగ్గకుండా అధిష్ఠానం ఎలాంటి ‘సమతుల్య’ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే!

