- ఖమ్మం క్యాంప్ కార్యాలయంలో మంత్రి పొంగులేటి
కాకతీయ, మరియు సెంటర్ : ఆపదలో ఉన్న ప్రతి నిరుపేద కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, వారి కన్నీళ్లు తుడవడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. శనివారం ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పేదలకు వైద్య ఖర్చుల భారం కాకూడదన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కులను వేగవంతంగా అందిస్తున్నట్లు తెలిపారు.
ఖమ్మం రూరల్ మండలం, ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 129 మంది లబ్ధిదారులకు రూ.35,91,500 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను, అలాగే ఖమ్మం రూరల్ మండలానికి చెందిన ముగ్గురికి కల్యాణలక్ష్మి చెక్కులను ఆయన అందజేశారు. ఆడబిడ్డల వివాహాలకు కల్యాణలక్ష్మి పథకం గొప్ప ఆసరాగా నిలుస్తోందని మంత్రి పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి క్యాంపు కార్యాలయ ఇన్చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి, స్థానిక కాంగ్రెస్ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

