ఉద్యోగ నోటిఫికేషన్లపై కేటీఆర్ వ్యాఖ్యలు సిగ్గుచేటు
పదేళ్ల పాలనలో ఏం చేశారో ముందు లెక్క చెప్పాలి
దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా బీఆర్ఎస్ నేతల తీరు
నిరుద్యోగ యువతను రెచ్చగొట్టడం మానుకోవాలి
కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మంజె మల్లేశం
కాకతీయ, చేర్యాల: ఉద్యోగాల నోటిఫికేషన్ల అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేస్తున్న విమర్శలు హాస్యాస్పదమని, పదేళ్లపాటు అధికారంలో ఉండి యువతకు అన్యాయం చేసిన ఆయనకు ఉద్యోగాలపై మాట్లాడే నైతిక అర్హత లేదని చేర్యాల మండల కాంగ్రెస్ అధ్యక్షులు మంజె మల్లేశం విమర్శించారు. చేర్యాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సరూర్ నగర్ లో యువ సంగ్రామ సదస్సులో కేటీఆర్ మాట్లాడిన మాటలు వింటుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని మల్లేశం ఎద్దేవా చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఖాళీ పోస్టులను భర్తీ చేయకుండా లక్షలాది మంది నిరుద్యోగులను నిరాశలోకి నెట్టారని, అప్పుడు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిన నాయకులు, ఇప్పుడు ఉద్యోగాల పేరుతో మొసలి కన్నీళ్లు కార్చడం సిగ్గుచేటని మండిపడ్డారు. నిరుద్యోగ యువత జీవితాలతో రాజకీయం చేయడం మానుకోవాలని, ఇప్పటికైనా విద్యార్థులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఆపాలని హితవు పలికారు. ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగాల భర్తీని అత్యంత పారదర్శకంగా చేపడుతోందని మల్లేశం స్పష్టం చేశారు. ముందుగా పదేళ్ల పాలనలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో లెక్క చెప్పాలని, ఆ తర్వాతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని కేటీఆర్కు సవాల్ విసిరారు. ప్రజలు గత పాలనను మర్చిపోలేదని, రాజకీయ విమర్శలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను ఎవరూ నమ్మరని మల్లేశం పేర్కొన్నారు.

