కడియం పచ్చి అవకాశ వాది
కాళేశ్వరంపై మాట మార్చడం నిదర్శనం
కాళేశ్వరం ప్రాజెక్టుపై గతంలో ప్రశంసలు
ఇప్పుడు విమర్శించడం ద్వంద్వ వైఖరికి తార్కాణం
ఆంధ్రప్రదేశ్కు మేలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారం
స్టేషన్ ఘనపూర్ అభివృద్ధిపై ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధం
కమీషన్ల కోసమే కడియం శ్రీహరి రాజకీయాలు
మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆరోపణలు
కాకతీయ, జనగామ : తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీస్తూ, కాళేశ్వరం ప్రాజెక్టుపై అసత్య ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోందని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆరోపించారు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టును ఇంజినీరింగ్ అద్భుతం, వరప్రదాయిని, మానస పుత్రికగా కొనియాడిన స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఇప్పుడు అదే ప్రాజెక్టును విమర్శించడం అవకాశవాద రాజకీయాలకు నిదర్శనమని ఆయన విమర్శించారు. స్టేషన్ ఘనపూర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తాటికొండ రాజయ్య మాట్లాడారు. గత వారం రోజులుగా నియోజకవర్గంలో పర్యటిస్తూ కడియం శ్రీహరి ప్రజలను తప్పుదోవ పట్టించేలా అబద్ధాలు చెబుతున్నారని అన్నారు. ఆయన వ్యాఖ్యలు చిన్నపిల్లల చిలిపి చేష్టలను తలపిస్తున్నాయని, ప్రజలు వాటిని నమ్మే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. రాజకీయ లబ్ధి కోసమే కడియం శ్రీహరి మాటలు మారుస్తున్నారని విమర్శించారు.
కాళేశ్వరం తెలంగాణకు కల్పతరువు
కాళేశ్వరం అంటే కేవలం మేడిగడ్డ బ్యారేజీ మాత్రమే కాదని, అది 16 రిజర్వాయర్లకు నీరందించే మహత్తర సాగునీటి వ్యవస్థ అని రాజయ్య పేర్కొన్నారు. తెలంగాణ రైతాంగ భవిష్యత్తుకు కీలకమైన ఈ ప్రాజెక్టుపై దుష్ప్రచారం చేయడం రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధమని అన్నారు. దేవాదుల ప్రాజెక్టుకు కడియం శ్రీహరి సృష్టికర్త కాదని, వినాశకర్తగా చరిత్రలో నిలిచిపోతారని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు చెడ్డపేరు తీసుకురావాలనే ఉద్దేశంతోనే కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఇప్పుడు జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థకు లేఖలు రాయడం ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నమేనని అన్నారు.
రాష్ట్రంలో రేవంత్ కరువు, ఘనపూర్లో కడియం కరువు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సాగునీటి ప్రాజెక్టులపై, రైతుల సమస్యలపై కనీస అవగాహన లేదని రాజయ్య విమర్శించారు. రాష్ట్రంలో ఆయన పాలన వల్ల కరువు పరిస్థితులు ఏర్పడితే, స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో కడియం శ్రీహరి వైఫల్యం కారణంగా అభివృద్ధి కరువైందని అన్నారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ రైతులకు సాగునీరు అందించలేకపోతున్నానని చెప్పడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాల్సింది పోయి, కమిషన్లు వచ్చే పనులపైనే కడియం శ్రీహరి ఆసక్తి చూపుతున్నారని ఆరోపించారు. ప్రాజెక్టుల అంచనాలను పెంచి కమిషన్ల కోసం వ్యవహరించిన చరిత్ర ఆయనదేనని అన్నారు.
అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధం
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ అభివృద్ధి విషయంలో ఎవరు ఎంత చేశారో ప్రజల ముందే తేల్చుకుందామని రాజయ్య సవాల్ విసిరారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చేపట్టిన అభివృద్ధి పనులు, కడియం శ్రీహరి చేసిన పనులపై బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. స్టేషన్ ఘనపూర్ అంబేద్కర్ విగ్రహం వద్దకు వచ్చి ప్రజల సమక్షంలో చర్చిద్దామని సవాల్ చేశారు. అసలు కాంగ్రెస్ నాయకులకు పదవులు రాకుండా కడియం శ్రీహరి అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన నాయకుడు ఎంత మాట్లాడినా వాస్తవాలు మారవని, ప్రజలే తగిన సమయంలో సమాధానం చెబుతారని రాజయ్య అన్నారు.

