రూ.180 కోట్ల డ్రైనేజీ టెండర్లో భారీ గోల్మాల్..?
సర్ధార్ రవీందర్ సింగ్
భూగర్భ మురుగునీటి టెండర్పై సంచలన ఆరోపణలు
రూ.40–50 కోట్ల కమిషన్లపై అనుమానాలు
టెండర్ వ్యవహారంపై సమగ్ర విచారణకు డిమాండ్
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ నగరంలో రూ.180 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న భూగర్భ మురుగునీటి (అండర్గ్రౌండ్ డ్రైనేజీ) పనుల టెండర్ ప్రక్రియపై మాజీ మేయర్, రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ మాజీ చైర్మన్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్, 58వ డివిజన్ కార్పొరేటర్ సర్ధార్ రవీందర్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ టెండర్ వ్యవహారంలో రూ.40–50 కోట్ల వరకు చేతులు మారాయనే అనుమానాలు ఉన్నాయని, కేవలం కమిషన్ల కోసమే కాంట్రాక్టర్లకు అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయని అన్నారు. ప్రజల అవసరాల కోసం చేపట్టాల్సిన భారీ ప్రాజెక్టును కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసం ఉపయోగించవద్దని డిమాండ్ చేశారు.
కరీంనగర్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భూగర్భ మురుగునీటి వ్యవస్థ కోసం ప్రభుత్వం జీవో నంబర్–745 ద్వారా రూ.180 కోట్ల నిధులు కేటాయించిందని, ఇంత భారీ మొత్తంలో ప్రజాధనం ఖర్చు చేస్తున్నప్పుడు టెండర్ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉండాలని అన్నారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయని పేర్కొన్నారు.
రద్దైన అదనపు టెండర్.. మళ్లీ అదే కాంట్రాక్టర్కే ఎలా?
అదనపు (ఎక్సెస్) టెండర్ను రద్దు చేసి.. మళ్లీ అదే కాంట్రాక్టర్కు పనులు అప్పగించడం వెనుక ఆంతర్యమేంటని సర్ధార్ రవీందర్ సింగ్ ప్రశ్నించారు. అదనపు టెండర్ను రద్దు చేయడానికి బలమైన కారణం ఉండాలని, నిబంధనల ప్రకారం తగిన అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. కేవలం 5 శాతం అదనపు ధర పేరుతో టెండర్ ప్రక్రియను మార్చి, తిరిగి అదే కాంట్రాక్టర్కు పనులు కట్టబెట్టడం వెనుక అసలు కారణాలను ప్రభుత్వం వెల్లడించాలని డిమాండ్ చేశారు.రూ.50 లక్షల పనులకు ఒక నిబంధన.. రూ.180 కోట్ల పనులకు మరో నిబంధనా?” అని ప్రశ్నించారు. ఇటీవల రూ.50 లక్షల విలువైన పనుల్లో అదనపు ధర కారణంగా జిల్లా కలెక్టర్ టెండర్ను రద్దు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అదే నిబంధన భారీ విలువైన భూగర్భ మురుగునీటి టెండర్కు ఎందుకు వర్తించదని నిలదీశారు.
కమిషన్ల కోసమేనా ఈ టెండర్?
టెండర్ వ్యవహారంలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే కమిషన్ల కోసం కాంట్రాక్టర్లకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే అనుమానం కలుగుతోందని సర్ధార్ రవీందర్ సింగ్ అన్నారు. రూ.40–50 కోట్ల వరకు చేతులు మారాయనే అనుమానాలపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించి వాస్తవాలను ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు.నేను చేస్తున్నవి ఆరోపణలు మాత్రమే. వాటిపై విచారణ జరిపి నిజానిజాలు తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. టెండర్లో ఎలాంటి లావాదేవీలు జరగకపోతే పూర్తి వివరాలను బహిర్గతం చేయాలి” అని అన్నారు.
స్మార్ట్ సిటీ పనులపైనా ప్రశ్నలు
కరీంనగర్ నగరంలో గతంలో చేపట్టిన స్మార్ట్ సిటీ పనులపైనా సర్ధార్ రవీందర్ సింగ్ ప్రశ్నలు సంధించారు. సీసీ రోడ్లు, ఇతర నిర్మాణ పనులు చేపట్టేటప్పుడు భవిష్యత్తులో భూగర్భ మురుగునీటి నిర్మాణానికి ఇబ్బందులు లేకుండా ముందుగానే అంతర్గత అనుసంధానాలు, ప్రధాన మురుగునీటి లైన్లు, తనిఖీ గదులు (ఇన్స్పెక్షన్ ఛాంబర్లు) ఏర్పాటు చేయాల్సి ఉంటుందని తెలిపారు.
అయితే నగరంలోని అనేక ప్రాంతాల్లో తనిఖీ గదులు లేవని, ప్రధాన భూగర్భ మురుగునీటి వ్యవస్థకు సరైన అనుసంధానాలు లేవని ఆరోపించారు.
“రూ.180 కోట్లతో కొత్తగా మురుగునీటి పనులు చేపడుతున్నప్పుడు గతంలో చేసిన పనుల పరిస్థితి ఏమిటి? ఎక్కడెక్కడ తనిఖీ గదులు నిర్మించారు? ఎన్ని ప్రాంతాలకు అనుసంధానాలు ఇచ్చారు?” అని ప్రశ్నించారు.
ప్రతి డివిజన్లో ఎన్ని తనిఖీ గదులు నిర్మిస్తున్నారు? ఎన్ని ఇళ్లకు అంతర్గత అనుసంధానాలు ఇస్తున్నారు? ప్రధాన మురుగునీటి లైన్కు ఎక్కడెక్కడ అనుసంధానం కల్పిస్తున్నారో పూర్తి వివరాలను ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు.
గత పనులపై సమీక్ష లేకుండానే మళ్లీ పనులా?
గతంలో స్మార్ట్ సిటీ కింద చేపట్టిన పనులను పూర్తిస్థాయిలో పరిశీలించకుండా మళ్లీ అదే కాంట్రాక్టర్కు భారీ విలువైన పనులు అప్పగించడం ఏమిటని ప్రశ్నించారు. గత పనుల నాణ్యత, పూర్తి స్థాయి, మురుగునీటి అనుసంధానాలు, తనిఖీ గదులు, ప్రజలకు అందిన ప్రయోజనాలపై ముందుగా సమీక్ష నిర్వహించాలని అన్నారు.
గతంలో ఇదే సంస్థపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఫిర్యాదు చేశారని, ఇప్పుడు అదే సంస్థకు మళ్లీ భారీ విలువైన టెండర్ ఎలా దక్కిందని ప్రశ్నించారు. అప్పట్లో చేసిన ఆరోపణలు నిజమా? కాదా? అన్నది ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్–బీజేపీ కుమ్మక్కుపై అనుమానాలు
కరీంనగర్ నగరంలో జరుగుతున్న టెండర్ వ్యవహారాలపై కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య కుమ్మక్కు ఉందనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయని సర్ధార్ రవీందర్ సింగ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ నాయకత్వం కలిసి కరీంనగర్ ప్రజలపై భారాన్ని మోపుతున్నాయనే అనుమానం కలుగుతోందన్నారు.కాంగ్రెస్, బీజేపీ నేతలకు నిజంగా కరీంనగర్ ప్రజలపై ప్రేమ, గౌరవం ఉంటే టెండర్ ప్రక్రియను వెంటనే పారదర్శకంగా నిర్వహించాలి. గతంలో అదనపు టెండర్ ఎందుకు రద్దయింది? ఇప్పుడు మళ్లీ అదే కాంట్రాక్టర్కు ఎలా పనులు వచ్చాయి? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు.
మురుగునీటి శుద్ధి కేంద్రాల పరిస్థితి వెల్లడించాలి
నగరంలో ఇప్పటికే ఉన్న మురుగునీటి శుద్ధి కేంద్రాల (ఎస్టీపీలు) పరిస్థితిపై కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని సర్ధార్ రవీందర్ సింగ్ అన్నారు. సీతారాంపూర్లో 5 ఎంఎల్డీ, కిసాన్నగర్లో 6 ఎంఎల్డీ, అలుగునూరులో 2 ఎంఎల్డీ సామర్థ్యం కలిగిన శుద్ధి కేంద్రాల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. సదాశివపల్లి ప్రాంతంలోని పనుల పరిస్థితి, స్థాయిలు, మురుగునీటి అనుసంధానంపై కూడా అధికారులు వివరాలు వెల్లడించాలని కోరారు.
ఇప్పటికే ఉన్న శుద్ధి కేంద్రాలు, మురుగునీటి వ్యవస్థ, స్మార్ట్ సిటీ పనులను పూర్తిగా పరిశీలించకుండా రూ.180 కోట్ల భూగర్భ మురుగునీటి ప్రాజెక్టు చేపట్టడం వల్ల ప్రయోజనం ఏమిటి? గతంలో చేసిన పనుల పరిస్థితిని చూడకుండా కొత్త పనులు చేపట్టడం ఎందుకు?అని ప్రశ్నించారు.
ప్రజాధనం దుర్వినియోగమైతే న్యాయపోరాటం
భూగర్భ మురుగునీటి ప్రాజెక్టును ప్రజలకు ఉపయోగపడేలా అమలు చేయాలని, కేవలం టెండర్లు కేటాయించి పనులు ప్రారంభించడం కాకుండా భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని సమగ్ర ప్రణాళిక రూపొందించాలని సర్ధార్ రవీందర్ సింగ్ కోరారు.
ఇది ప్రజల సౌకర్యం కోసం చేసే టెండర్ కావాలి.. కమిషన్ల కోసం చేసే టెండర్ కాకూడదు. కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసం ప్రజల సొమ్మును ఖర్చు చేయొద్దు. కరీంనగర్ నగరాన్ని కాంట్రాక్టర్ల ప్రయోగశాలగా మార్చకండి అని వ్యాఖ్యానించారు.
రూ.180 కోట్ల భూగర్భ మురుగునీటి టెండర్పై సమగ్ర విచారణ జరిపి, అదనపు టెండర్ రద్దు నుంచి మళ్లీ టెండర్ కేటాయింపు వరకు జరిగిన ప్రతి అంశాన్ని బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. టెండర్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని భావిస్తే ప్రజల తరఫున న్యాయస్థానాన్ని ఆశ్రయించి న్యాయపోరాటం చేస్తామని సర్ధార్ రవీందర్ సింగ్ స్పష్టం చేశారు.కరీంనగర్ ప్రజల సొమ్ము కరీంనగర్ అభివృద్ధికే ఖర్చు కావాలి. కమిషన్లు, కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసం ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాకూడదు అని అన్నారు.

