ఫైర్ సేఫ్టీకి అనుమతులున్నాయా..?
భద్రత గాలికొదిలేసి బిల్డ్ ఎక్స్పో నిర్వహణ!
ఫైర్ ఎన్వోసీ తీసుకున్నారా..? అగ్నిమాపక శాఖ తనిఖీలు జరిగాయా..?
స్టాళ్లలో ఫైర్ ఎక్స్టింగ్విషర్లు, ఎమర్జెన్సీ ఎగ్జిట్లు సరిపడా ఉన్నాయా..?
వేలాది మంది వచ్చే కార్యక్రమానికి డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ ఎక్కడ..?
లక్షలు వసూలు చేస్తున్న నిర్వాహకులు…
సందర్శకుల భద్రతను విస్మరిస్తున్నారనే విమర్శలు
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో నిర్వహిస్తున్న ‘బిల్డ్ ఎక్స్పో–2026’లో భద్రతా ప్రమాణాలపై తీవ్ర సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిర్మాణ రంగానికి చెందిన ప్రతిష్ఠాత్మక ప్రదర్శనగా ప్రచారం చేస్తూ లక్షల రూపాయలు వసూలు చేసి స్టాళ్లు కేటాయించిన నిర్వాహకులు, వేలాది మంది సందర్శకుల ప్రాణ భద్రత విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అగ్నిమాపక భద్రత, అత్యవసర నిష్క్రమణ మార్గాలు, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏర్పాట్లపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యే ఈ తరహా కార్యక్రమానికి సంబంధిత శాఖల అనుమతులు పూర్తిగా తీసుకున్నారా? నిబంధనల ప్రకారం అన్ని ఏర్పాట్లు చేశారా? అనే అంశాలపై స్పష్టత లేకపోవడం ఆందోళనకు గురిచేస్తోంది.
ఫైర్ ఎన్వోసీ తీసుకున్నారా..?
భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యే తాత్కాలిక ప్రదర్శనలు, ఎగ్జిబిషన్లు నిర్వహించాలంటే అగ్నిమాపక శాఖ నుంచి ఫైర్ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్వోసీ) తీసుకోవడం కీలక నిబంధన. అయితే ఈ బిల్డ్ ఎక్స్పోకు నిర్వాహకులు ఫైర్ ఎన్వోసీ పొందారా? లేదా? అనే అంశంపై స్పష్టత లేదు. తాత్కాలిక షెడ్లు, భారీ విద్యుత్ వైరింగ్, అలంకరణ సామగ్రి, ఎలక్ట్రానిక్ పరికరాలు ఉన్న ప్రాంగణంలో అగ్నిప్రమాద అవకాశాలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు భద్రతా చర్యలు తప్పనిసరి. అయినప్పటికీ ఆ ప్రక్రియ పూర్తయిందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రదర్శన ప్రారంభానికి ముందు అగ్నిమాపక శాఖ అధికారులు ప్రాంగణాన్ని క్షుణ్ణంగా పరిశీలించారా? స్టాళ్ల నిర్మాణం, విద్యుత్ కనెక్షన్లు, వైరింగ్, ఎమర్జెన్సీ సదుపాయాలను పరిశీలించి అనుమతులు జారీ చేశారా? లేక కేవలం కాగితాలపైనే ప్రక్రియ ముగిసిందా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇలాంటి భారీ ఈవెంట్లలో ప్రతి స్టాల్, ప్రతి విద్యుత్ కనెక్షన్ను పరిశీలించడం అత్యవసరం అయినప్పటికీ, అలాంటి తనిఖీలు జరిగాయా అనే విషయంపై సంబంధిత అధికారులు స్పందించాల్సిన అవసరం ఉందని సందర్శకులు అభిప్రాయపడుతున్నారు.
ఫైర్ ఎక్స్టింగ్విషర్లు సరిపడా ఉన్నాయా..?
అగ్నిప్రమాదం సంభవించిన తొలి క్షణాల్లో మంటలను అదుపు చేయడానికి ఫైర్ ఎక్స్టింగ్విషర్లు అత్యంత కీలకం. అయితే ఎక్స్పోలో ప్రతి స్టాల్ వద్ద లేదా కీలక ప్రాంతాల్లో తగిన సంఖ్యలో అవి కనిపించడం లేదని పలువురు సందర్శకులు చెబుతున్నారు. ఒకవేళ షార్ట్సర్క్యూట్ లేదా ఇతర కారణాలతో ప్రమాదం జరిగితే తక్షణమే స్పందించే ఏర్పాట్లు ఉన్నాయా? అనేది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. వేలాది మంది ఒకేసారి తిరిగే ప్రాంగణంలో ప్రమాదం జరిగితే బయటపడేందుకు ప్రత్యేక నిష్క్రమణ మార్గాలు తప్పనిసరి. అయితే స్టాళ్లను దగ్గరదగ్గరగా ఏర్పాటు చేయడంతో అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు సురక్షితంగా బయటకు వెళ్లగలరా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎమర్జెన్సీ ఎగ్జిట్లు స్పష్టంగా గుర్తించేలా సూచికలు ఏర్పాటు చేశారా? వాటి ద్వారా ప్రజలను బయటకు తరలించే ఏర్పాట్లు చేశారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇంత పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనే కార్యక్రమానికి డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ సిద్ధం చేశారా? అగ్నిప్రమాదం, విద్యుత్ ప్రమాదం, తొక్కిసలాట లేదా ఇతర అత్యవసర పరిస్థితులు ఏర్పడితే ఎలా స్పందించాలి? ఎవరు బాధ్యతలు చేపట్టాలి? అనే అంశాలపై నిర్వాహకుల వద్ద కార్యాచరణ ప్రణాళిక ఉందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వైద్య సిబ్బంది, అంబులెన్స్, అత్యవసర స్పందన బృందాలు అందుబాటులో ఉన్నాయా? అనే విషయంపైనా స్పష్టత లేదు.
లక్షలు వసూలు… భద్రత మాత్రం ప్రశ్నార్థకం..?
స్టాళ్ల కేటాయింపుల ద్వారా లక్షల రూపాయలు వసూలు చేస్తున్న నిర్వాహకులు సందర్శకుల భద్రతకు మాత్రం తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిర్మాణ రంగానికి సంబంధించిన ఆధునిక సాంకేతికతను ప్రదర్శించే వేదికలోనే ప్రాథమిక భద్రతా ప్రమాణాలపై సందేహాలు వ్యక్తమవుతుండటం విచారకరమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రజల ప్రాణాలకు సంబంధించిన అంశంలో నిర్లక్ష్యం ఏమాత్రం సమర్థనీయం కాదని, జిల్లా యంత్రాంగం, అగ్నిమాపక శాఖ, మున్సిపల్ అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి నిబంధనల అమలుపై స్పష్టత ఇవ్వాలని సందర్శకులు కోరుతున్నారు. ఒకవేళ భద్రతా లోపాలు ఉంటే వెంటనే సరిదిద్దించి, ప్రజల ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

