ప్రభుత్వ భూములపై మళ్లీ కన్నేశారా..?
హుజురాబాద్లో రూ.2 కోట్ల ప్రభుత్వ స్థలంపై కబ్జా యత్నాల ఆరోపణలు
సర్వే నంబర్ 236లో పట్టాల కోసం మళ్లీ కదలికలు
రెవెన్యూ అధికారుల పాత్రపై అనుమానాలు
కలెక్టర్ జోక్యంతో సమగ్ర విచారణకు స్థానికుల డిమాండ్
కాకతీయ, కరీంనగర్/ హుజురాబాద్ : హుజురాబాద్ పట్టణంలోని గణేష్నగర్ సర్వే నంబర్ 236లోని ప్రభుత్వ భూములపై మరోసారి కబ్జా ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం దాదాపు రూ.2 కోట్ల విలువ చేసే ఈ భూములను కొందరు ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్థికంగా బలమైన వ్యక్తులు రెవెన్యూ అధికారుల సహకారంతో తమ పేర్లపై పట్టాలు పొందేందుకు ప్రయత్నిస్తున్నారనే ప్రచారం స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది. గతంలో ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లిన భూములపై మళ్లీ హక్కులు సాధించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.
వ్యవసాయం పేరుతో భూముల కేటాయింపు
స్థానికుల కథనం ప్రకారం, సుమారు 24 సంవత్సరాల క్రితం సర్వే నంబర్ 236లో కొందరికి తలా 10 గుంటల చొప్పున వ్యవసాయం చేసుకునేందుకు పాస్ పుస్తకాలు జారీ చేశారు. అయితే, భూములు పొందిన వారు ఎలాంటి సాగు చేయకపోవడంతో వాటి వినియోగంపై అప్పట్లోనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అనంతరం ప్రభుత్వం సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేసి భూములను తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఆ తర్వాత ఈ భూములను నిరుపేదల కోసం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి వినియోగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
భూమి విలువ పెరగడంతో కొత్త ఎత్తుగడలు
ఇటీవలి కాలంలో గణేష్నగర్ ప్రాంతంలో భూముల ధరలు భారీగా పెరగడంతో సర్వే నంబర్ 236పై మళ్లీ కొందరి దృష్టి పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూములకే మరోసారి పట్టాలు పొందేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇందుకు కొందరు రెవెన్యూ అధికారుల సహకారం కూడా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ భూముల పరిరక్షణలో అధికార యంత్రాంగం వైఖరిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సర్వే నంబర్ 236కు సంబంధించిన పూర్తి భూ రికార్డులను పరిశీలించి, ప్రస్తుతం ఎలాంటి రెవెన్యూ ప్రక్రియలు కొనసాగుతున్నాయో జిల్లా యంత్రాంగం స్పష్టత ఇవ్వాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చిన భూములపై ప్రస్తుతం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో వెల్లడించాలని కోరుతున్నారు. ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా జిల్లా కలెక్టర్ స్వయంగా జోక్యం చేసుకుని సమగ్ర విచారణ నిర్వహించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. అక్రమాలు జరిగినట్లు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, ఈ భూములను ప్రజా ప్రయోజనాల కోసం, ముఖ్యంగా నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి వినియోగించేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. రెవెన్యూ యంత్రాంగంపై ప్రత్యేక పర్యవేక్షణ ఏర్పాటు చేసి ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

