కమిషనరేట్లో భారీగా సీఐల బదిలీలు
22 మంది ఇన్స్పెక్టర్లకు స్థానచలనం
కీలక పోలీస్స్టేషన్లకు కొత్త అధికారుల నియామకం
పోస్టింగ్ల కోసం ఎమ్మెల్యేల సిఫారసులు
ఎవరి ఫైరవీ ఫలించింది..? అంటూ పోలీస్ వర్గాల్లో చర్చ
కాకతీయ, వరంగల్ బ్యూరో : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇన్స్పెక్టర్ల బదిలీలు కలకలం రేపుతున్నాయి. ఏకంగా 22 మంది ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. పరిపాలనా కారణాలతో తక్షణ ప్రభావంతో బదిలీలు చేపట్టినట్లు అధికారిక ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కొత్తగా పోస్టింగ్ పొందిన అధికారులు వెంటనే బాధ్యతలు చేపట్టాలని ఆదేశించారు. ఈ బదిలీల్లో స్టేషన్ ఘన్పూర్, పరకాల, ధర్మసాగర్, ఆత్మకూరు, హనుమకొండ ఉమెన్ పోలీస్ స్టేషన్, ఎల్కతుర్తి, వర్ధన్నపేట, పాలకుర్తి, రఘునాథపల్లి తదితర ప్రాంతాల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఎస్. శ్రీనివాస్ స్టేషన్ ఘన్పూర్ ఎస్హెచ్ఓగా, జి. వేణు రఘునాథపల్లి సీఐగా, పి. దేవేందర్ నర్మెట్ట సీఐగా, బరత్ సుమన్ పాలకుర్తి సీఐగా నియమితులయ్యారు. ఎ. ప్రవీణ్ కుమార్ పరకాల ఎస్హెచ్ఓగా, అనుముల శ్రీనివాస్ ధర్మసాగర్ ఎస్హెచ్ఓగా, జి. బాబులాల్ ఆత్మకూరు ఎస్హెచ్ఓగా బాధ్యతలు చేపట్టనున్నారు.
హనుమకొండలోనూ మార్పులు..
హనుమకొండ ఉమెన్ పోలీస్ స్టేషన్–Iకి పి. రమేష్ను ఎస్హెచ్ఓగా నియమించారు. ఇప్పటి వరకు అక్కడ పనిచేసిన కె. సూర్య ప్రసాద్ను సీటీసీ వరంగల్కు బదిలీ చేశారు. అలాగే ఉమెన్ పోలీస్ స్టేషన్–IIకి టి. రవి కుమార్ను నియమించగా, ఎ. సువర్ణను సీసీఎస్ వరంగల్కు బదిలీ చేశారు. ఎ. శ్రీనివాస్ను సీసీబీ వరంగల్కు, బి. రాజగోపాల్ను టాస్క్ఫోర్స్కు, టి. కిరణ్ను పీసీఆర్ వరంగల్కు పంపించారు. కె. సాయి రమణను సీసీబీకి బదిలీ చేసి డ్రగ్ కంట్రోల్ టీమ్కు అటాచ్ చేశారు. పి. మంగీలాల్ టాస్క్ఫోర్స్లో కొనసాగుతూ మిల్స్ కాలనీ పోలీస్స్టేషన్కు అటాచ్ అయ్యారు. వై. సంజీవరావును వర్ధన్నపేట సీఐగా నియమించగా, అక్కడ సీఐగా పనిచేసిన కె. శ్రీనివాసరావును సీసీఆర్బీ వరంగల్కు బదిలీ చేశారు. దీంతో వర్ధన్నపేట పోలీస్ విభాగంలోనూ కొత్త నాయకత్వం ఏర్పడింది.
ఎమ్మెల్యేల ఫైరవీ లేఖలపై చర్చ..?
ఇక ఈ బదిలీలకు ముందే పలువురు ఇన్స్పెక్టర్లు తమకు అనుకూలమైన స్టేషన్ల కోసం ప్రజాప్రతినిధులను ఆశ్రయించినట్లు పోలీస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పలువురు ఎమ్మెల్యేలు తమకు కావాల్సిన అధికారుల కోసం సిఫారసు లేఖలు ఇచ్చినట్లు, ఆయా లేఖల ఆధారంగా పోస్టింగ్ల కోసం ప్రయత్నాలు జరిగినట్లు ప్రచారం సాగుతోంది. అయితే అధికారిక ఉత్తర్వుల్లో మాత్రం బదిలీలకు కారణంగా పరిపాలనా అవసరాలు అని మాత్రమే పేర్కొన్నారు. ఎమ్మెల్యేల సిఫారసు లేఖల ఆధారంగా పోస్టింగ్లు ఇచ్చినట్లు పోలీస్ వర్గాల్లో చర్చించుకోవడం గమనార్హం.
ఎవరి ఫైరవీ ఫలించింది..?
కీలక పోలీస్స్టేషన్లలో పోస్టింగ్ల కోసం ప్రజాప్రతినిధుల స్థాయిలో జరిగిన ప్రయత్నాలపై ఇప్పుడు పోలీస్ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ముఖ్యంగా పరకాల, స్టేషన్ ఘన్పూర్, పాలకుర్తి, రఘునాథపల్లి, ఆత్మకూరు, ధర్మసాగర్, ఎల్కతుర్తి వంటి ప్రాంతాల్లో పోస్టింగ్లు పొందిన అధికారుల విషయంలో సిఫారసులు పనిచేశాయని మాట్లాడుకోవడం చర్చనీయాంశంగా మారింది.
వెంటనే విధుల్లో చేరాలని ఆదేశం..
బదిలీ అయిన ఇన్స్పెక్టర్లను సంబంధిత ఏసీపీలు వెంటనే రిలీవ్ చేసి, కొత్త పోస్టింగ్ ప్రదేశాల్లో విధుల్లో చేరేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించారు. రిలీవ్, జాయినింగ్ తేదీలను కమిషనర్ కార్యాలయానికి తెలియజేయాలని సూచించారు. వరంగల్ కమిషనరేట్లో గతంలోనూ ఇన్స్పెక్టర్లు, ఎస్ఐల బదిలీలు చోటుచేసుకున్నాయి. జూన్లో 23 మంది ఎస్ఐల బదిలీలు, ఆగస్టులో నలుగురు సీఐల బదిలీలు జరిగిన విషయం తెలిసిందే. మొత్తంగా తాజా బదిలీలతో వరంగల్ కమిషనరేట్లో పోలీస్ స్టేషన్ల స్థాయిలో భారీగా సమీకరణాలు మారగా, కొత్త అధికారులు తమ పనితీరుతో ఎలా ప్రభావం చూపుతారన్నది ఆసక్తికరంగా మారింది.

