హుజురాబాద్ను చెత్త కుప్పగా మార్చే కుట్ర
డంపింగ్ యార్డును ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుంటాం
బీఆర్ ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఉద్ఘాటన
కాకతీయ, హుజురాబాద్ : హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో నిర్వహించిన ప్రెస్మీట్లో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు జిల్లాల చెత్తను హుజురాబాద్కు తరలించి డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలన్న యత్నాన్ని ఆయన ఖండించారు.డంపింగ్ యార్డ్ వల్ల గాలి, నీరు, భూమి కాలుష్యానికి గురై ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయం దెబ్బతింటుందని, తాగునీరు కలుషితం అవుతుందని, రోగాలు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు.ప్రజల అభిప్రాయాన్ని పట్టించుకోకుండా తీసుకున్న ఈ నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. హుజురాబాద్ ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం ఆడుకుంటోందని విమర్శించారు.డంపింగ్ యార్డ్ అంశంలో రాజీకి రానని స్పష్టం చేసిన ఆయన, తనపై తప్పుడు కేసులు పెట్టి సీబీసీఐడీ ద్వారా బెదిరింపులు వస్తున్నాయని ఆరోపించారు. అయినప్పటికీ ప్రజల కోసం పోరాటం ఆగదని, ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేదిలేదని తెలిపారు.ఈ అంశంపై కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, మాజీ మంత్రి ఈటల రాజేందర్ స్పందించకపోవడంపై ప్రశ్నలు లేవనెత్తారు. ప్రజలు ఏకమై డంపింగ్ యార్డ్కు వ్యతిరేకంగా గళమెత్తాలని పిలుపునిచ్చారు.
ఈ నెల 22న పాదయాత్ర చేపట్టి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. డంపింగ్ యార్డ్ ప్రతిపాదన పూర్తిగా రద్దు అయ్యే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.బండ శ్రీనివాస్, తక్కళ్లపల్లి రాజేశ్వరరావు, గందె శ్రీనివాస్, పింగిల్ రమేష్, తక్కళ్లపల్లి సత్యనారాయణరావు, తిరుపతి రావు, చుక్కా రంజిత్, సురేందర్ రెడ్డి, రవీందర్ రావు, బచ్చు శివశంకర్, పోడేటి రామస్వామి తదితరులు పాల్గొన్నారు.

