తులం బంగారం ఇవ్వాల్సిందే
పేదలకు మేలు చేసే పథకాలు ఆపొద్దు..
పథకాల పేర్లు మార్చినా పరవాలేదు.. లబ్ధిదారులకు అన్యాయం చేయొద్దు
న్యూట్రిషన్ కిట్లు, కేసీఆర్ కిట్లను యథావిధిగా కొనసాగించాలి
ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే డంపింగ్ యార్డ్ను అడ్డుకుంటాం
డంపింగ్ యార్డ్ రద్దు అయ్యే వరకు విశ్రమించే ప్రసక్తే లేదు
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
రూ. 4.61 కోట్ల కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
కాకతీయ, హుజూరాబాద్ : పేదలకు మేలు చేసే సంక్షేమ పథకాలను నిలిపివేయడం సరికాదని, ఆడబిడ్డల పెళ్లిళ్లకు కల్యాణ లక్ష్మి చెక్కుతో పాటు వాగ్దానం చేసిన తులం బంగారం కూడా అందించాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం హుజూరాబాద్ పట్టణంలోని సిటీ సెంటర్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో 461 మంది లబ్ధిదారులకు రూ. 4,61,53,473 విలువైన కల్యాణ లక్ష్మి – షాదీ ముబారక్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పేదల జీవితాల్లో గణనీయమైన మార్పులు తీసుకువచ్చాయని గుర్తుచేశారు. పథకాల పేర్లు మార్చుకున్నా తమకు అభ్యంతరం లేదని, కానీ పేదలకు అందుతున్న ఫలాలను మాత్రం ఆపవద్దని కోరారు.
డంపింగ్ యార్డ్పై యుద్ధం
హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలో ప్రతిపాదించిన డంపింగ్ యార్డ్ ఏర్పాటుపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జనావాసాల మధ్య డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తే ప్రజల ఆరోగ్యం, పర్యావరణం దారుణంగా దెబ్బతింటాయని హెచ్చరించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఏ నిర్ణయాన్నైనా తాము అడ్డుకుంటామని స్పష్టం చేశారు. డంపింగ్ యార్డ్ ప్రతిపాదనను ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని, లేనిపక్షంలో ప్రజలతో కలిసి ఐక్యంగా పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన నేతలకు, అధికారులకు తేల్చి చెప్పారు.
పాత పథకాలు కొనసాగించాలి
గత ప్రభుత్వ హయాంలో గర్భిణీలకు అందించిన న్యూట్రిషన్ కిట్లు, ప్రసవానంతరం అందించే కేసీఆర్ కిట్లు పేద కుటుంబాలకు కొండంత అండగా నిలిచాయని ఎమ్మెల్యే వివరించారు. ఈ సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీ మేరకు కల్యాణ లక్ష్మి పథకం కింద తులం బంగారం ఎప్పుడు ఇస్తారో ప్రభుత్వం స్పష్టం చేయాలని నిలదీశారు. పేద ప్రజల పక్షాన అసెంబ్లీ లోపల, బయట పోరాడుతూనే ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, పార్టీ నాయకులు, పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు, ప్రజలు పాల్గొన్నారు. లబ్ధిదారులతో వ్యక్తిగతంగా మాట్లాడిన ఎమ్మెల్యే, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

