తండ్రిని హతమార్చిన తనయుడు
మద్యం కోసం వేధిస్తున్నాడని కుమారుడి ఆగ్రహం
ఇటుకతో మోదీ హత్య.. లారీ క్లీనర్గా పనిచేస్తున్న మృతుడు సయ్యద్ జాబేర్
నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
కాకతీయ, పెద్దపెల్లి: పెద్దపల్లి పట్టణంలోని ఈద్గా కాలనీలో మంగళవారం ఉదయం దారుణ ఘటన చోటుచేసుకుంది. మద్యం వ్యసనంతో కుటుంబాన్ని వేధిస్తున్న తండ్రిని, కన్న కుమారుడే ఇటుకతో కొట్టి ప్రాణాలు తీయడం స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈద్గా కాలనీకి చెందిన సయ్యద్ జాబేర్ లారీ క్లీనర్గా పనిచేసేవాడు. కుటుంబ సమస్యల కారణంగా మొదటి భార్యకు విడాకులు ఇచ్చి, ఆమె సోదరినే రెండో వివాహం చేసుకున్నాడు. ఇద్దరు భార్యల పిల్లలు కలిసి ఒకే ఇంట్లో ఉంటూ హోటళ్లలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు.
వేధింపులే ప్రాణం తీశాయి..
జాబేర్ గత కొంతకాలంగా మద్యానికి బానిసై పనులకు వెళ్లడం మానేశాడు. పిల్లలు సంపాదించిన డబ్బులను లాక్కుంటూ, ఇవ్వకపోతే వారిని శారీరకగా, మానసికగా వేధిస్తున్నాడని సమాచారం. మంగళవారం ఉదయం కూడా డబ్బుల విషయంలో తండ్రీకొడుకుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహానికి లోనైన 18 ఏళ్ల కుమారుడు, క్షణికావేశంలో ఇంటి వద్ద ఉన్న ఇటుకతో తండ్రి తలపై బలంగా కొట్టాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో జాబేర్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పెద్దపల్లి పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడైన కుమారుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం కోసం కుటుంబాన్ని వేధించడమే ఈ హత్యకు ప్రధాన కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనతో ఈద్గా కాలనీలో భయాందోళనలు నెలకొన్నాయి.

