ప్రణాళికతో పోటీ పరీక్షలకు సిద్ధమవ్వాలి
సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
జిల్లా గ్రంథాలయంలో అభ్యర్థులతో కలెక్టర్ ముచ్చట
ఉద్యోగ ప్రిపరేషన్, చదువుతున్న పుస్తకాలపై ఆరా
ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని సూచన
కాకతీయ, సిరిసిల్ల టౌన్: పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు సరైన ప్రణాళికతో ముందడుగు వేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. మంగళవారం జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని సందర్శించిన కలెక్టర్, అక్కడ వివిధ పోటీ పరీక్షల కోసం చదువుకుంటున్న యువతతో నేరుగా మాట్లాడారు. అభ్యర్థుల విద్యార్హతలు, వారు ఏ ఉద్యోగాలకు సిద్ధమవుతున్నారు, ఏయే పుస్తకాలను అనుసరిస్తున్నారు అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు.
అభ్యర్థులకు కీలక సూచనలు
ఈ సందర్భంగా కలెక్టర్ అభ్యర్థులకు పలు సూచనలు చేశారు. ప్రతి సబ్జెక్టును ఒక క్రమపద్ధతిలో చదవాలని, ముఖ్యంగా మారుతున్న పరీక్షా విధానాలకు అనుగుణంగా కరెంట్ అఫైర్స్ (వర్తమాన అంశాలు)పై పట్టు సాధించాలని చెప్పారు. ప్రాథమికాంశాల కోసం ఎన్సీఈఆర్టీ పుస్తకాలను రిఫరెన్స్గా తీసుకోవడం ఎంతో ప్రయోజనకరమని పేర్కొన్నారు. గ్రంథాలయానికి ప్రతిరోజూ ఎంత మంది అభ్యర్థులు వస్తున్నారనే వివరాలను గ్రంథాలయ అధికారిని అడిగి తెలుసుకున్నారు. గ్రంథాలయంలో ఉన్న వసతులను సద్వినియోగం చేసుకుని, పట్టుదలతో చదివి ఉన్నత ఉద్యోగాలను సాధించాలని అభ్యర్థులను ఆకాంక్షించారు.

