మే 7వరకు బెస్ట్ అవైలబుల్ స్కూల్కు దరఖాస్తు గడువు
14న లాటరీ ద్వారా విద్యార్థుల ఎంపిక
జిల్లాకు మొత్తం 5 సీట్ల కేటాయింపు
పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
కాకతీయ, పెద్దపల్లి : జిల్లాలోని గిరిజన విద్యార్థులకు 2026-27 విద్యాసంవత్సరానికి గాను బెస్ట్ అవైలబుల్ స్కూళ్లలో ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. 3వ, 5వ మరియు 8వ తరగతుల్లో ప్రవేశం పొందగోరే అర్హులైన విద్యార్థులు మే 7వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు తమ దరఖాస్తులను సమర్పించాలని సూచించారు. కరీంనగర్ లోని గిరిజన అభివృద్ధి శాఖ కార్యాలయంలో ఈ దరఖాస్తులు అందజేయాలని పేర్కొన్నారు. జిల్లాకు మొత్తం 5 సీట్లను ప్రభుత్వం కేటాయించినట్లు కలెక్టర్ వివరించారు. ఇందులో 3వ తరగతిలో లంబాడ బాలికలు, బాలురు మరియు ఎరుకుల బాలురకు ఒక్కో సీటు చొప్పున కేటాయించారు. అలాగే 5వ తరగతిలో గోండు బాలురకు ఒక సీటు, 8వ తరగతిలో లంబాడ బాలికలకు ఒక సీటు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. ఈ అవకాశాన్ని అర్హులైన గిరిజన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
నిబంధనలు మరియు ఎంపిక విధానం
ప్రవేశం కోరే విద్యార్థుల కుటుంబ వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.5 లక్షల లోపు ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. దరఖాస్తుతో పాటు ఆదాయ, కుల, జనన ధృవీకరణ పత్రాలు, స్టడీ సర్టిఫికెట్లు, గుర్తింపు కార్డు మరియు ఫోటోలను జత చేయాల్సి ఉంటుందని తెలిపారు. అందిన దరఖాస్తులను పరిశీలించిన అనంతరం మే 14వ తేదీన లాటరీ పద్ధతి ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తామని వెల్లడించారు. ఇతర వివరాల కోసం 9502664044, 9959914511 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత విద్యాశాఖ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

