నిల్వ ఉన్న పంటలను కొనుగోలు చేయాలి
నెలకు పైగా మార్కెట్ యార్డులోనే రైతుల నిరీక్షణ
దళారులకు అమ్ముకుని నష్టపోవాల్సిన దుస్థితి
బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి
కాకతీయ, గజ్వేల్: గజ్వేల్ మార్కెట్ యార్డుకు పంటలు తీసుకువచ్చి నెల రోజులు గడుస్తున్నా ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంపై బీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన పార్టీ శ్రేణులతో కలిసి యార్డులోని పొద్దుతిరుగుడు, మొక్కజొన్న పంటలను పరిశీలించి, రైతులతో మాట్లాడారు. ఎండల్లో నిద్రాహారాలు మానుకుని అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే నాథుడే లేడని రైతులు ఆయన వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాలు సకాలంలో ఏర్పాటు చేయకపోవడం వల్లే రైతులు దళారులను ఆశ్రయించి క్వింటాకు రూ.1000 నుంచి రూ.2000 వరకు నష్టపోతున్నారని వంటేరు విమర్శించారు. ప్రభుత్వం దళారులతో కుమ్మక్కై రైతుల నడ్డి విరుస్తోందని మండిపడ్డారు. మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ జలాలతో రైతులు కష్టపడి పంటలు పండిస్తే, వాటిని కొనుగోలు చేయడంలో రేవంత్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు.
ధర్నాకు సిద్ధం..
వెంటనే ఆంక్షలు లేకుండా మద్దతు ధరతో పంటలు కొనుగోలు చేయాలని, లేనిపక్షంలో వేలాది మంది రైతులతో కలిసి మార్కెట్ యార్డు వద్ద, రాజీవ్ రహదారిపై భారీ ధర్నా చేపడతామని హెచ్చరించారు. గత కేసీఆర్ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం, ఉచిత కరెంటు అందిస్తూ, పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసి అన్నదాతలను ఆదుకుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గంగిశెట్టి చందన రవీందర్, వైస్ చైర్పర్సన్ పద్మాబాయి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షుడు బెండ మధు, నాయకులు నవాజ్ మీరా, బొల్లారం ఎల్లయ్య, పంగ మల్లేశం, అర్జున్ గౌడ్ మరియు కౌన్సిలర్లు, పార్టీ కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

