బుద్ధుని బోధనలు మానవాళికి ఆదర్శం
ఘనంగా బుద్ధ జయంతి వేడుకలు
నివాళులర్పించిన లింగాల రవికుమార్
కాకతీయ, మయూరి సెంటర్ : గౌతమ బుద్ధుని బోధనలు ప్రపంచ మానవాళికి ఆదర్శప్రాయమని అంబేద్కర్ ప్రజా సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు లింగాల రవికుమార్ పేర్కొన్నారు. బుద్ధ జయంతిని పురస్కరించుకుని ఖమ్మంలోని సంఘ కార్యాలయంలో శుక్రవారం బుద్ధుని చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. సామాజిక ఉద్యమ నేత గుంతేటి వీరభద్రంతో కలిసి ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
శాంతి, సత్యమే మార్గం..
ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ.. సిద్ధార్థుడు రాజరికపు సౌఖ్యాలను త్యజించి, లోక కల్యాణం కోసం సత్యాన్వేషణ చేశారని కొనియాడారు. ప్రపంచానికి ధర్మం, సత్యం, న్యాయం, ప్రేమ అనే గొప్ప సందేశాలను అందించడమే కాకుండా, వాటిని ఆచరించి చూపిన మహనీయుడని ప్రశంసించారు. నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ బుద్ధుని బోధనల స్ఫూర్తితో శాంతియుత మార్గంలో పయనించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కత్రం పుష్పరాజ్, రామాల భాస్కర్, కె. నాగేశ్వరరావు, సునీత, నిర్మల తదితరులు పాల్గొన్నారు.

