ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరుస్తాం
ప్రతి హామీని నెరవేర్చేందుకు చిత్తశుద్ధితో ప్రభుత్వం
మంత్రి కొండా సురేఖ వెల్లడి
ఉమ్మడి వరంగల్ జిల్లా ఉద్యమకారుల వినతికి మంత్రి స్పందన
జూన్ 2న గౌరవ వందనం చేయాలని విజ్ఞప్తి
కాకతీయ, వరంగల్: తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. శనివారం వరంగల్లోని ఆమె నివాసంలో ఉమ్మడి జిల్లా ఉద్యమకారుల సంఘం కన్వీనర్ మరుపల్ల రవి ఆధ్వర్యంలో పలువురు ఉద్యమకారులు మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఉద్యమకారుల సమస్యలను ఆమె సావధానంగా అడిగి తెలుసుకున్నారు. ఉద్యమ సమయంలో పోలీసుల దెబ్బలు తిని, జైలు జీవితం అనుభవించిన అనేకమంది ఉద్యమకారుల పరిస్థితి ప్రస్తుతం అత్యంత దయనీయంగా ఉందని మరుపల్ల రవి మంత్రికి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు.. అర్హులైన ప్రతి ఉద్యమకారుడికి ఈ ఏడాది జూన్ 2న (తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం) ప్రశంసా పత్రం ఇచ్చి గౌరవించాలని కోరారు. అలాగే ప్రతి ఒక్కరికీ 250 గజాల ఇంటి స్థలం, రూ. 25 వేల పింఛను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
కుటుంబాలకు భరోసా..
మరణించిన ఉద్యమకారుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించి ఆదుకోవాలని వారు కోరారు. దీనిపై స్పందించిన మంత్రి.. ఉద్యమకారుల త్యాగాలను ప్రభుత్వం గుర్తించిందని, వారి ఆకాంక్షలకు అనుగుణంగా తగిన నిర్ణయాలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వినతిపత్రం సమర్పించిన వారిలో ఉద్యమకారులు మేకల ఎల్లయ్య, కోడూరి నరేష్, మోక్ష, మాడిశెట్టి రాజకుమార్ తదితరులు ఉన్నారు.

