మంత్రిపై అసత్య ఆరోపణలు చేస్తే సహించం
చెన్నూరు అభివృద్ధిని చూసి ఓర్వలేకే విమర్శలు
రహదారి పనులను పరిశీలించిన డీసీసీ అధ్యక్షుడు రఘునాథ రెడ్డి
కాకతీయ, చెన్నూరు: చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న ఎమ్మెల్యే, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిపై మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కావాలనే అసత్య ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు పిన్నింటి రఘునాథ రెడ్డి మండిపడ్డారు. సోమవారం చెన్నూరు పట్టణంలో కొనసాగుతున్న రహదారి వెడల్పు పనులను పార్టీ నాయకులతో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం రఘునాథ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పట్టణంలో ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న రహదారి వెడల్పు సమస్యను మంత్రి చొరవతో పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. స్థానిక వ్యాపారస్థులతో చర్చించి, వారి ఒప్పందం మేరకే పనులు చేపడుతున్నామని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియలో దుకాణాలు కోల్పోయిన వారికి ప్రత్యామ్నాయంగా నిర్మాణ స్థలాన్ని మరియు తగిన నష్టపరిహారాన్ని ప్రభుత్వం అందిస్తుందని భరోసా ఇచ్చారు.
ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు..
ప్రత్యేక నిధులతో చెన్నూరు మున్సిపాలిటీని మంత్రి అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతుంటే, బాల్క సుమన్ ఆ అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసం మంత్రిపై బురదజల్లడం మానుకోవాలని, మరోసారి ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

