యువత నైపుణ్యాలతోనే 3 ట్రిలియన్ లక్ష్యం
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
మంథనిలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభం
కాకతీయ, మంథని : యువత నైపుణ్యాభివృద్ధితోనే తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దగలమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. టాస్క్ ఆధ్వర్యంలో మంథనిలో ఏర్పాటు చేసిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, యువతకు ఆధునిక సాంకేతిక నైపుణ్యాలు అందించి ఉపాధి అవకాశాలు పెంపొందించడమే లక్ష్యమన్నారు. కేంద్రంలో డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మల్టీమీడియా, ఆడియో–విజువల్ రంగాల్లో శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. సిఎస్ఆర్ భాగంగా క్ట్రిల్ స్ డేటా సెంటర్ సహకారంతో శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
హైదరాబాద్కు దూరంగా ఉన్న మంథని వంటి ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు సవాలేనని, అయితే స్థానిక యువతలో నైపుణ్యాలు పెంపొందిస్తే ఉపాధి అవకాశాలు విస్తరిస్తాయని అన్నారు. రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో నైపుణ్యాభివృద్ధి కీలకమని స్పష్టం చేశారు.
విద్యార్థులకు సాంప్రదాయిక విద్యతో పాటు పరిశ్రమలకు అవసరమైన ప్రాక్టికల్ నైపుణ్యాలు అవసరమని, అందుకే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ప్రారంభించినట్లు చెప్పారు. టాస్క్ ద్వారా శిక్షణ పొందిన పలువురు మల్టీనేషనల్ కంపెనీల్లో మంచి ఉద్యోగాలు సాధిస్తున్నారని తెలిపారు. యువత ఈ అవకాశాలను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
మహిళల సాధికారతకు కుట్టు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, గంగాపురిలో రూ.7.3 కోట్లతో ప్లగ్ అండ్ ప్లే గార్మెంట్స్ యూనిట్కు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. ఇది పూర్తయితే ఒకేసారి 400 మందికి శిక్షణ కల్పించే అవకాశం ఉంటుందని చెప్పారు.
పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ, నిరుద్యోగ యువత కష్టపడే ధోరణి అలవరుచుకుంటేనే విజయం సాధ్యమన్నారు. AI వంటి ఆధునిక సాంకేతికతలను నేర్చుకోవడం అవసరమని సూచించారు.
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, ఆర్డీవో సురేష్, మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్, టాస్క్ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.


