ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తరుగు దోపిడీపై రాస్తా రోకో…
ఎమ్మెల్యే బాధ్యత వహించాలి బీజేపీ
కాకతీయ, గంగాధర : చొప్పదండి నియోజకవర్గంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ‘తరుగు’ పేరిట జరుగుతున్న అదనపు తూకం దోపిడీపై బీజేపీ కిసాన్ మోర్చా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారానికి స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పూర్తి బాధ్యత వహించాలని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు.
బుధవారం గంగాధర చౌరస్తాలో బీజేపీ మండల అధ్యక్షుడు పంజాల ప్రశాంత్ ఆధ్వర్యంలో రైతులు, పార్టీ నాయకులు పెద్ద ఎత్తున రాస్తా రోకో నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం, స్థానిక యంత్రాంగంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. నాణ్యమైన ధాన్యాన్ని కూడా కావాలనే ‘బి-గ్రేడ్’గా చూపిస్తూ క్వింటాల్కు రూ.20 వరకు కోత విధిస్తున్నారని ఆరోపించారు. చొప్పదండి నియోజకవర్గంలో రైతులను నిలువునా ముంచే కొత్త తరహా దోపిడీ కొనసాగుతోందని మండిపడ్డారు.
కొనుగోలు కేంద్రాలను ఉద్దేశపూర్వకంగా ఆలస్యంగా ప్రారంభించడం వల్ల తేమ శాతం 17 నుంచి 11 శాతానికి పడిపోయిందని, దీంతో ప్రతి క్వింటాల్కు సుమారు 6 కిలోల వరకు రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎఫ్సీఐ నిబంధనలకు తక్కువగా తాలు ఉన్నప్పటికీ మిల్లర్లు అధికార పార్టీ అండతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. నియోజకవర్గంలో ఏ ఒక్క తహసీల్దార్ కూడా కొనుగోలు కేంద్రాలను సందర్శించకపోవడం వెనుక ఉన్న కారణాలపై ప్రశ్నలు లేవనెత్తారు.

గత పదేళ్లలో సంచికి 5–6 కిలోల తరుగు తీసి రైతులను నష్టపరిచిన బీఆర్ఎస్ నేతలు, ఇప్పుడు అదే అంశంపై కాంగ్రెస్ను విమర్శించడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. రైతు ప్రయోజనాలను గాలికొదిలేస్తే బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు అన్నాడి కృష్ణారెడ్డి, జిల్లా కోశాధికారి వైద రామానుజం, అసెంబ్లీ కన్వీనర్ పేరుక శ్రవణ్ కుమార్, ఓబీసీ జిల్లా అధ్యక్షుడు దూలం కల్యాణ్, మాజీ మండల అధ్యక్షుడు కోల అశోక్, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడవల్లి శశిధర్ రెడ్డి, కిసాన్ మోర్చా నాయకులు తూమ్ నారాయణతో పాటు సర్పంచులు, ఉప సర్పంచులు, జిల్లా, మండల నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

