అటల్ టింకరింగ్ ల్యాబ్ నిధుల స్వాహా..?
బోయినపల్లి మోడల్ స్కూల్లో వరుస అవినీతి ఆరోపణలు
ప్రొసీడింగ్స్కు విరుద్ధంగా జువాలజీ టీచర్కు ఏటీఎల్ బాధ్యతలు
ఇన్స్పైర్ నామినేషన్లు సున్నా… అయినా లక్షల్లో ఖర్చుల నమోదు
సమగ్ర శిక్ష, అమ్మ ఆదర్శ పాఠశాల నిధులపైనా అక్రమాల ఆరోపణలు
విద్యార్థుల ఫిర్యాదులను పట్టించుకోని యాజమాన్యం, అధికారులు
అధికారుల అండదండలతోనే అవినీతి అంటూ స్థానికుల మండిపాటు
కాకతీయ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : ప్రభుత్వ పథకాల పేరుతో విద్యార్థుల అభివృద్ధికి విడుదలయ్యే నిధులు నిజంగా విద్య కోసం ఖర్చవుతున్నాయా? లేక కొందరి వ్యక్తిగత ప్రయోజనాలకు మళ్లుతున్నాయా? అనే అనుమానాలు బోయినపల్లి మోడల్ స్కూల్ చుట్టూ ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. గత కొన్నేళ్లుగా సమగ్ర శిక్ష, అమ్మ ఆదర్శ పాఠశాల నిధుల వినియోగంపై వివాదాలు ఎదుర్కొంటున్న ఈ పాఠశాల ఇప్పుడు అటల్ టింకరింగ్ ల్యాబ్ (ఏటీఎల్) నిధుల వ్యవహారంతో మరోసారి వార్తల్లో నిలిచింది. విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనా విధానం, సృజనాత్మకత, సాంకేతిక నైపుణ్యాలు పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అటల్ టింకరింగ్ ల్యాబ్ పథకం ఇక్కడ పూర్తిగా లక్ష్య నెరవేరడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.రికార్డుల్లో భారీ ఖర్చులు కనిపిస్తున్నప్పటికీ, వాస్తవంలో మాత్రం ఫలితాలు కనిపించడం లేదని విద్యార్థులు,తల్లిదండ్రులు, స్థానికులు ఆరోపిస్తున్నారు.

నిబంధనలకు మించి లక్షల్లో ఖర్చులా..?
సంబంధిత మార్గదర్శకాల ప్రకారం ఒక విద్యా సంవత్సరంలో రూ.2 లక్షలకు మించి ఖర్చు చేయరాదని నిబంధనలు ఉన్నప్పటికీ 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి సుమారు రూ.3,67,620 వరకు ఖర్చు చూపినట్లు సమాచారం. అనుమతించిన పరిమితికి దాదాపు రెండింతల వరకు నిధులు డ్రా చేయడం ఇప్పుడు తీవ్ర అనుమానాలకు దారితీస్తోంది.విద్యార్థుల కోసం ఎలాంటి వినూత్న కార్యక్రమాలు జరగలేదు,పోటీలు కనిపించలేదు,ఇన్స్పైర్ నామినేషన్లు ఒక్కటీ వెళ్లలేదు మరి ఈ భారీ ఖర్చులు ఎక్కడ జరిగాయి? అని స్థానిక విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు.
ప్రొసీడింగ్స్ను పక్కనబెట్టి బాధ్యతల అప్పగింత..?
అటల్ టింకరింగ్ ల్యాబ్ ఇంచార్జిగా సాధారణంగా గణితం లేదా భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులను మాత్రమే నియమించాలని ఉన్నతాధికారుల ఆదేశాలు ఉన్నాయని సమాచారం.రోబోటిక్స్, ఎలక్ట్రానిక్స్, సెన్సార్ ఆధారిత పరికరాలు వంటి సాంకేతిక అంశాలపై అవగాహన ఉండే ఉపాధ్యాయులకే ఈ బాధ్యతలు ఇవ్వాలని నిబంధనలు చెబుతున్నాయి.అయితే ఈ ప్రొసీడింగ్స్ను పక్కనబెట్టి ఒక జువాలజీ టీచర్కు ఏటీఎల్ ఇంచార్జి బాధ్యతలు అప్పగించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.అంతేకాకుండా సెప్టెంబర్, నవంబర్ నెలల్లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమాలకు సంబంధిత వ్యక్తి భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు గా హాజరైనట్లు సమాచారం బయటకు రావడం మరింత వివాదానికి దారితీసింది.అసలు అర్హత ఏమిటి? ఏ ప్రాతిపదికన బాధ్యతలు ఇచ్చారు? శిక్షణ రికార్డుల్లో హోదా ఎలా మారింది? అనే ప్రశ్నలు ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశమయ్యాయి.పాఠశాలలో సృజనాత్మక కార్యక్రమాలు సమర్థంగా అమలైతే సాధారణంగా విద్యార్థుల నుంచి ఇన్స్పైర్ అవార్డుల కోసం నామినేషన్లు వెళ్తుంటాయి. కానీ ఇక్కడ ఒక్క నామినేషన్ కూడా వెళ్లలేదని సమాచారం. అయినప్పటికీ ఏటీఎల్ నిధులు మాత్రం భారీగా డ్రా చేయడం ఇప్పుడు అనుమానాలకు కేంద్రబిందువైంది.
ఏటీఎల్ నిధులతో నెక్సాన్ కారు కొనుగోలు..?
ఈ వ్యవహారంలో మరింత సంచలనంగా మారిన ఆరోపణ ఏమిటంటే ఏటీఎల్ నిధులను డ్రా చేసి వాటిలో కొంత మొత్తాన్ని డౌన్ పేమెంట్ రూపంలో నెక్సాన్ కారు కొనుగోలుకు వినియోగించారన్న చర్చ. ఇందులో సంబంధిత ఇంచార్జితో పాటు ప్రిన్సిపాల్కూ వాటా వెళ్లిందని కొందరు ఆరోపిస్తున్నారు.గతంలో సమగ్ర శిక్ష నిధులు వ్యక్తిగత ఖాతాలకు మళ్లించారన్న ఆధారాలు ఉన్నాయి. దీంతో ఇప్పుడు ఈ వ్యవహారం మరింత అనుమానాస్పదంగా మారింది. నిధుల డ్రాయింగ్ తేదీలు, బ్యాంకు లావాదేవీలు, వాహన కొనుగోలు సమయాన్ని పరిశీలిస్తే అసలు విషయాలు బయటపడతాయి అని కొందరు ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు.
ప్రైవేటు మెంటార్ నియామకంపై అనుమానాలు..?
ఏటీఎల్ కార్యక్రమంలో భాగంగా నియమించిన ప్రైవేట్ మెంటార్ పాఠశాలకు చాలా అరుదుగా వచ్చేవాడని విద్యార్థులే చెబుతున్నారని సమాచారం. వచ్చిన రోజుల్లో కూడా సాంకేతిక అంశాలు బోధించకుండా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్ వంటి సామాజిక మాధ్యమాల గురించే మాట్లాడేవాడని విద్యార్థులు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.ఈ విషయాన్ని విద్యార్థులు తమ ఉపాధ్యాయులకు, అనంతరం ప్రిన్సిపాల్కు కూడా తెలియజేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని సమాచారం.ఒక సందర్భంలో సిబ్బంది సమావేశం జరుగుతున్న సమయంలో విద్యార్థులే వెళ్లి మాకు పనిచేసే నమూనాలు చూపించడం లేదు పాతవి, పని చేయని నమూనాలు మాత్రమే చూపిస్తున్నారు అని నేరుగా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
సైన్స్ డే కూడా ఫెయిల్..?
పాఠశాలలో నిర్వహించిన సైన్స్ డే కార్యక్రమంలో ఒక్క పనిచేసే నమూనా కూడా లేకపోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది.లక్షల్లో ఖర్చు చూపించిన ఏటీఎల్ ల్యాబ్ నుంచి విద్యార్థులు రూపొందించిన ఒక్క సమర్థవంతమైన ప్రాజెక్టు కూడా ప్రదర్శించలేకపోయారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.ల్యాబ్ ఉందంటే ఫోటోలు మాత్రమే కాదు విద్యార్థులు నేర్చుకునే ఫలితాలు కూడా కనిపించాలి అని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.విద్యా సంవత్సరం మొత్తం పెద్దగా కార్యక్రమాలు లేకపోయినా చివరి రోజుల్లో మాత్రమే హడావుడిగా ప్రదర్శనలు, ఫోటో చిత్రీకరణలు నిర్వహించి ఏటీఎల్ కార్యక్రమాలు విజయవంతంగా జరిగాయి అనే భావన సృష్టించే ప్రయత్నం చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.కొన్ని ఫోటోలు తీసి రికార్డుల్లో చూపించడం తప్ప విద్యార్థులకు నిజమైన ప్రాయోగిక విద్య అందలేదని స్థానికులు విమర్శిస్తున్నారు.
ఫిర్యాదులపై ఎంఈఓ వైఖరి వివాదాస్పదం…
పాఠశాలపై వచ్చిన అనేక ఫిర్యాదులకు విచారణ అధికారిగా నియమితమైన ఎంఈఓనే సంబంధిత అధికారులను కాపాడుతున్నాడని తల్లిదండ్రులు, కొందరు ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు.ఫిర్యాదు చేస్తే విచారణ పేరుతో కాలయాపన చివరికి నివేదికలు బయటకు రావు వచ్చినా చర్యలు ఉండవు అని స్థానికులు మండిపడుతున్నారు.పాఠశాలలో జరుగుతున్న వ్యవహారాలపై ఉన్నతాధికారులకు పూర్తి సమాచారం ఉన్నప్పటికీ రాజకీయ, అధికార ప్రభావాల కారణంగా చర్యలు నిలిచిపోతున్నాయి అని కొందరు ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు.నిజమైన విచారణ జరిగితే ఇంకా పెద్ద విషయాలు బయటపడతాయి.ఈ వ్యవహారంపై జిల్లా స్థాయి కాకుండా స్వతంత్ర విచారణ జరగాలని స్థానిక ప్రజలు, తల్లిదండ్రులు, కొందరు ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు. బ్యాంకు ఖాతాలు, కొనుగోలు బిల్లులు, స్టాక్ రిజిస్టర్లు, ఏటీఎల్ పరికరాలు, శిక్షణ రికార్డులు, మెంటార్ హాజరు వివరాలు, ఇన్స్పైర్ అవార్డుల సమాచారం అన్నింటినీ సమగ్రంగా పరిశీలించాలని కోరుతున్నారు.విద్యార్థుల భవిష్యత్తు కోసం వచ్చిన నిధులు కొందరి వ్యక్తిగత ప్రయోజనాలకు వినియోగిస్తే అది కేవలం అవినీతి కాదు విద్యా వ్యవస్థపై నేరం అని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అధికారుల అండదండలు లేకుండా ఇంత పెద్ద స్థాయిలో అక్రమాలు జరగవు. నిజమైన విచారణ జరిగితే ఇంకా ఎన్నో విషయాలు బయటపడతాయి అని విద్యావేత్తలు పేర్కొంటున్నారు.

