మే 20 న దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్
తెలంగాణ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్
ఆన్లైన్ ఫార్మసీలు, నకిలీ ప్రిస్క్రిప్షన్లపై నిరసనకు పిలుపు
కాకతీయ, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా మే 20 న మెడికల్ షాపుల బంద్కు పిలుపునిచ్చినట్లు తెలంగాణ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ (టీటీసీడీఏ) వెల్లడించింది. అఖిల భారత కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ సంస్థ (ఏఐఓసీడీ) ఆధ్వర్యంలో దేశంలోని 12,40000 మంది కెమిస్టులు, పంపిణీదారులు ఈ నిరసనలో భాగస్వాములు కానున్నారని తెలిపారు. నిబంధనలు లేని ఈ-ఫార్మసీల వల్ల, కృత్రిమ మేధ సాంకేతికతతో సృష్టిస్తున్న నకిలీ ప్రిస్క్రిప్షన్ల వల్ల ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పు వాటిల్లుతోందని అసోసియేషన్ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆన్లైన్ వేదికలపై యాంటీబయాటిక్స్, అలవాటుగా మారే ప్రమాదకర మందులను యథేచ్ఛగా విక్రయించడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. కార్పొరేట్ సంస్థలు భారీ డిస్కౌంట్లతో ఔషధ విక్రయ రంగాన్ని దెబ్బతీస్తున్నాయని మండిపడ్డారు.
The All India Organisation of Chemists & Druggists (AIOCD), representing 12.40 lakh #chemists and #distributors nationwide, along with #TelanganaChemists & #DruggistsAssociation (TTCDA), has called for a #nationwide #medicalshopbandh on May 20.
The associations… pic.twitter.com/OnZ9WcBPfn
— NewsMeter (@NewsMeter_In) May 16, 2026
కేంద్రం స్పందించకుంటే నిరవధిక సమ్మె
ఈ-ఫార్మసీల అక్రమ విక్రయాల వల్ల సాధారణ మందుల దుకాణదారులు ఉపాధి కోల్పోవడమే కాకుండా, తప్పుడు మందుల వాడకంతో ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని అసోసియేషన్ నాయకులు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆన్లైన్ ఔషధ విక్రయాలపై కఠినమైన నిబంధనలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ బంద్ ద్వారా ప్రభుత్వానికి తమ నిరసనను తెలియజేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించని పక్షంలో, రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. ప్రజారోగ్య పరిరక్షణ, కెమిస్టుల మనుగడ కోసమే ఈ బంద్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.

