పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలి
సామాన్యులపై మోయలేని భారం
కాంగ్రెస్ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ ఖాన్
కాకతీయ, కరకగూడెం : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడ్డగోలుగా పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తక్షణమే తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనార్టీ అధ్యక్షులు మహమ్మద్ ఖాన్ డిమాండ్ చేశారు. ఇంధన ధరలపై కేంద్ర ప్రభుత్వం అదనంగా మూడు రూపాయలు పెంచడం అత్యంత దుర్మార్గానికి నిదర్శనమని, ఈ అనాలోచిత నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే ద్రవ్యోల్బణం, ఆర్థిక ఇబ్బందులతో అల్లాడుతున్న సామాన్య, మధ్యతరగతి ప్రజలపై కేంద్రం మరోసారి ధరల భారాన్ని మోపడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. డీజిల్, పెట్రోల్ ధరల పెరుగుదల వల్ల రవాణా ఖర్చులు విపరీతంగా పెరిగి, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ ధరల పెరుగుదల దేశంలోని నిరుపేద కుటుంబాల జీవన స్థితిగతులను మరింత కుంగదీస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించి, కార్పొరేట్ శక్తులకు లబ్ధి చేకూరుస్తూ ఇలా ధరలు పెంచుకుంటూ పోతే రాబోయే రోజుల్లో ప్రజలే తగిన బుద్ధి చెప్తారని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి, పెంచిన ఇంధన ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో సామాన్యుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపడతామని మహమ్మద్ ఖాన్ స్పష్టం చేశారు.

