గ్రామాభివృద్ధే ప్రభుత్వం లక్ష్యం
సంక్షేమ పథకాలతో పేదలకు అండ
వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.150 కోట్లు
వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
బండపల్లిలో రూ.20 లక్షలతో నూతన గ్రామ పంచాయతీ భవనానికి శంకుస్థాపన
కాకతీయ, వేములవాడ : గ్రామాల అభివృద్ధితోనే రాష్ట్ర ప్రగతి సాధ్యమవుతుందని, గ్రామ పంచాయతీలే దేశానికి పట్టుకొమ్మలని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. రాజన్న సిరిсиల్ల జిల్లా చందుర్తి మండలం బండపల్లి గ్రామంలో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించనున్న నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులకు బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత ప్రజా ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.
మహిళా సంక్షేమం – విద్యా రంగానికి పెద్దపీట
మహిళా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యం ద్వారా ఇప్పటివరకు సుమారు రూ.10 వేల కోట్ల మేర మహిళలకు డబ్బు ఆదా జరిగిందని ఆది శ్రీనివాస్ వెల్లడించారు. గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్నబియ్యం పంపిణీ, ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంపు, రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ వంటి పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామన్నారు. యువత భవిష్యత్తు కోసం రూ.200 కోట్లతో 25 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో “యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్” మంజూరైందని, భవిష్యత్తులో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ తరహాలో తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను తీసుకువస్తామని చెప్పారు. రాష్ట్రాన్ని గంజాయి రహిత తెలంగాణగా తీర్చిదిద్దేందుకు సీఎం రేవంత్ రెడ్డి గట్టి పట్టుదలతో ఉన్నారని పేర్కొన్నారు.
నియోజకవర్గ అభివృద్ధి పనులు వేగవంతం
వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి రూ.150 కోట్ల నిధులతో పనులు కొనసాగుతున్నాయని, పట్టణంలో రోడ్డు విస్తరణ పనులు కూడా చేపట్టామని విప్ తెలిపారు. కలికోట సూరమ్మ ప్రాజెక్టు పనులు వేగంగా సాగుతున్నాయని, త్వరలోనే కుడి, ఎడమ కాలువల నిర్మాణ పనులను కూడా ప్రారంభిస్తామని ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

