ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలు
జిల్లాలో ఇంకా 60 శాతం వరి కొనుగోలు కేంద్రాల్లోనే నిల్వ
లారీల కొరత, తరుగు పేరిట క్వింటాల్కు 10 కిలోల కోత
తీవ్ర ఇబ్బందుల్లో రైతులు: సుంకే రవిశంకర్
సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ చిత్ర మిశ్రాకు వినతి
కాకతీయ, కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో ఇప్పటివరకు కేవలం 40 శాతం వరి ధాన్యాన్నే ప్రభుత్వం కొనుగోలు చేసిందని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఆరోపించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యలపై జిల్లా కలెక్టర్ చిత్ర మిశ్రాను గురువారం ఆయన కలెక్టరేట్ కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సుంకే రవిశంకర్ మాట్లాడుతూ.. జిల్లాలోని చొప్పదండి, రామడుగు, గంగాధర మండలాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు నరకయాతన అనుభవిస్తున్నారని తెలిపారు. ఐకేపీ కేంద్రాల్లో తూకాల్లో మోసాలు, అక్రమాలు యథేచ్ఛగా జరుగుతున్నాయని ఆరోపించారు. గత 45 రోజులుగా లారీల కొరత తీవ్రంగా ఉండటంతో ధాన్యం తూకం వేసినా మిల్లులకు తరలింపులో తీవ్ర జాప్యం జరుగుతోందన్నారు. మట్టి తరలింపు వ్యాపారాలపై ప్రభుత్వం చూపుతున్న శ్రద్ధను, అన్నదాతల ధాన్యం కొనుగోళ్లపై చూపాలని హితవు పలికారు.
తరుగు పేరిట దోపిడీ.. చెదలు పడుతున్న బస్తాలు
కొనుగోలు కేంద్రాల్లో నెలల తరబడి నిల్వ ఉంచిన ధాన్యపు సంచులకు కింద నుంచి చెదలు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని రవిశంకర్ విమర్శించారు. దీనికి తోడు ప్రతి క్వింటాల్ వడ్లకు ఏకంగా 10 కిలోల వరకు తరుగు పేరిట కోత విధిస్తూ రైతులను దారుణంగా నష్టపరుస్తున్నారని మండిపడ్డారు. గతంలో ‘ఏ’ గ్రేడ్గా నిర్ధారించిన ధాన్యాన్ని మిల్లుల వద్దకు వెళ్లేసరికి ‘బి’ గ్రేడ్గా చూపిస్తూ క్వింటాల్కు రూ.20 వరకు తగ్గిస్తున్నారని ఆరోపించారు. కేంద్రాల్లో గన్నీ సంచులు (గోనె సంచులు), హమాలీల కొరత కూడా వేధిస్తోందన్నారు. కొందరు లారీ యజమానులు లోడింగ్ కోసం ప్రతి బస్తాకు రూ.2 చొప్పున అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నా నివారించే నాథుడే కరువయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
యుద్ధప్రాతిపదికన తరలించాలి
జిల్లాలో దాదాపు 60 శాతం వరి ధాన్యం ఇంకా కొనుగోలు కేంద్రాల్లోనే ఎండకు ఎండుతూ, వానకు నానుతూ నిల్వ ఉండిపోయిందని, రానున్న రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో రైతులు గుండెచేతుల్లో పెట్టుకుని ఆందోళన చెందుతున్నారని తెలిపారు. అందువల్ల మట్టి తరలింపునకు వినియోగిస్తున్న లారీలను తక్షణమే ధాన్యం రవాణాకు మళ్లించాలని, యుద్ధప్రాతిపదికన ధాన్యాన్ని తూకం వేసి రైస్ మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్లు పొన్నం అనిల్కుమార్ గౌడ్, ఏనుగు రవీందర్ రెడ్డి మరియు పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

