దారిదోపిడీ నిందితుల అరెస్టు
24 గంటల్లోనే ఎనిమిది మంది అరెస్ట్
నిందితుల నుంచి నగదు, బంగారం, 4 ద్విచక్ర వాహనాలు స్వాధీనం
కేసు వివరాలు వెల్లడించిన జమ్మికుంట ఏసీపీ మాధవి
కాకతీయ, కరీంనగర్: కరీంనగర్ జిల్లా కోరపల్లి గ్రామంలో రోడ్డుపై పోలీసులమని చెబుతూ దోపిడీకి పాల్పడిన ఎనిమిది మందిని జమ్మికుంట పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదైన 24 గంటల్లోనే 8 మంది నిందితులను అరెస్ట్ చేసి, వారి నుంచి నగదు, రూ.38 వేల ఆన్లైన్ బదిలీ సొమ్ము, అర తులం బంగారం ఉంగరం, నాలుగు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ మాధవి వెల్లడించారు. శుక్రవారం జమ్మికుంట పోలీస్స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె ఈ కేసు వివరాలను మీడియాకు వివరించారు. అరెస్ట్ అయిన వారిలో పల్లపు ఈశ్వర్ అలియాస్ బన్నీ, పల్లపు అశోక్, ఎలకపల్లి ప్రమోద్, చుక్కారపు అఖిలేష్, మొగుళ్ల రాకేష్, పల్లపు మహేష్ (మల్లయ్య కుమారుడు), పల్లపు మహేష్ (రాములు కుమారుడు), తప్పేలా వంశీ ఉన్నారు. వీరి నుంచి రూ.14 వేల నగదు, దోచుకున్న అర తులం బంగారం ఉంగరం, నేరానికి ఉపయోగించిన నాలుగు బైక్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో పరారీలో ఉన్న మిగిలిన ముగ్గురు నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు ఏసీపీ తెలిపారు.
దాడి చేసి.. వసూళ్లు..
ఏసీపీ తెలిపిన వివరాల ప్రకారం.. మే 20వ తేదీ రాత్రి కోరపల్లి గ్రామం వైపు నుంచి వస్తున్న ఒక అశోక్ లేలాండ్ వాహనాన్ని (టీఎస్ 08 యూడీ 5457) 11 మంది దుండగులు అడ్డగించారు. వాహనంలో ప్రయాణిస్తున్న ఇద్దరిపై విచక్షణారహితంగా దాడి చేసి, వారిని సమీపంలోని ఎఫ్సీఐ గోదాం ఖాళీ ప్రదేశానికి ఈడ్చుకెళ్లారు. బాధితులను చంపేస్తామని బెదిరించి వారి వద్ద ఉన్న నగదు, బంగారు ఉంగరాన్ని లాక్కున్నారు. అంతటితో ఆగకుండా బాధితుల మొబైల్స్ ద్వారా ఫోన్పే యాప్ ఉపయోగించి బలవంతంగా రూ.38 వేలను తమ ఖాతాలకు బదిలీ చేయించుకున్నారు. ఆ తర్వాత మరో లక్ష రూపాయలు ఇవ్వాలంటూ బాధితులను రైల్వే స్టేషన్ వైపు తరలిస్తుండగా, వారు ప్రాణభయంతో గట్టిగా కేకలు వేశారు. బాధితుల అరుపులు విని స్థానికులు అప్రమత్తమవడంతో నిందితులు అక్కడి నుంచి చీకట్లోకి పరారయ్యారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన జమ్మికుంట పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. మే 21 ఉదయం సైదాబాద్ ఎక్స్రోడ్–కోరపల్లి మార్గంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని విచారించగా ఈ దోపిడీ నేరాన్ని అంగీకరించారు. అత్యంత చాకచక్యంగా 24 గంటల్లోనే నిందితులను పట్టుకున్న జమ్మికుంట సీఐ రామకృష్ణ గౌడ్, ఎస్ఐ రవి, హుజూరాబాద్ ఎస్ఐ రాధాకృష్ణ, ఐడీ పార్టీ సిబ్బందిని ఏసీపీ మాధవి ప్రత్యేకంగా అభినందించారు.

