కార్యకర్తల త్యాగాలను ప్రభుత్వం మర్చిపోదు
సుడా, గ్రంథాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు
జూన్ 2 నుంచి ‘ఇందిరమ్మ బీమా’ పథకం అమలు
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
సంక్షేమ పథకాలను గ్రామగ్రామానికి తీసుకెళ్లాలి
నిబద్ధతతో పనిచేస్తే గుర్తింపు ఖాయం : మంత్రి తుమ్మల
ఖమ్మం ఎస్ఆర్ గార్డెన్స్లో సుడా, జిల్లా గ్రంథాలయ చైర్మన్లకు అభినందన సభ
కాకతీయ, ఖమ్మం బ్యూరో : స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (సుడా), జిల్లా గ్రంథాలయ సంస్థల ద్వారా ప్రజలకు మరింత మెరుగైన, నాణ్యమైన సేవలను అందించాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. కష్టకాలంలో సైతం నిలబడి, పార్టీ జెండాను భుజాన వేసుకుని నడిచిన కార్యకర్తల త్యాగాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికీ మర్చిపోదని ఆయన స్పష్టం చేశారు. ఖమ్మంలోని ఎస్ఆర్ గార్డెన్స్లో సుడా నూతన చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహమ్మద్ ఖాదర్ బాబాలకు ఆదివారం నిర్వహించిన ఘన అభినందన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ఎమ్మెల్యేలు డాక్టర్ మట్ట రాగమయి, రాందాస్ నాయక్, కూనంనేని సాంబశివరావులతో కలిసి భట్టి విక్రమార్క ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులకు పదవులు వచ్చినప్పుడు కార్యకర్తలు చూపుతున్న ఈ అపారమైన ఆనందమే పార్టీపై వారికి ఉన్న అచంచల నిబద్ధతకు నిదర్శనమని డిప్యూటీ సీఎం కొనియాడారు.
గ్రంథాలయ ఉద్యమాల వేదిక ఖమ్మం
దేశ స్వాతంత్ర్య సమరానికి ముందే గ్రంథాలయ ఉద్యమాలు ప్రజల్లో అపరిమితమైన చైతన్యం నింపాయని, ముఖ్యంగా ఖమ్మం, సూర్యాపేట, జనగాం ప్రాంతాలు ఆనాటి చైతన్య ఉద్యమాలకు ప్రధాన కేంద్ర బిందువులుగా నిలిచాయని డిప్యూటీ సీఎం గుర్తుచేశారు. ప్రజలపై అత్యంత గాఢమైన ప్రభావం చూపే గ్రంథాలయ సంస్థకు చైర్మన్గా బాధ్యతలు స్వీకరిస్తున్న మహమ్మద్ ఖాదర్ బాబాకు ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు. సుడా, జిల్లా గ్రంథాలయ సంస్థల ద్వారా ప్రజలకు మరింత మేలు జరిగేలా సరికొత్త ప్రణాళికలతో పని చేయాలని, వీరికి అవసరమైన పూర్తి నిధులు, సహకారాన్ని స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు తప్పనిసరిగా అందిస్తారని హామీ ఇచ్చారు. 2014 నుంచి 2023 వరకు రెండు పర్యాయాలు సుదీర్ఘంగా ప్రతిప్క్షంలో ఉన్నప్పటికీ ఎన్నో ఇబ్బందులను ఓర్చి పోరాటం చేసిన ప్రతి ఒక్క మండల, మహిళా, యువజన విభాగ కార్యకర్తను ప్రభుత్వం గుండెల్లో పెట్టుకుని చూసుకుంటుందని భరోసా ఇచ్చారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజల సమగ్ర అభివృద్ధి కోసం సాధించుకుంటే, గత పాలకులు ప్రజా అవసరాలను పూర్తిగా పక్కనపెట్టి రాష్ట్రాన్ని కేవలం తమ కుటుంబ ప్రయోజనాల కోసమే అడ్డగోలుగా వినియోగించుకున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
జూన్ 2 నుంచి 5 లక్షల ఇందిరమ్మ బీమా రక్షణ కవచం!
ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి గ్రామగ్రామానికి, ఇంటింటికీ తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపైనే ఉందని భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఓపెన్ మార్కెట్లో కిలో 55 రూపాయలు పలుకుతున్న నాణ్యమైన సన్న బియ్యాన్ని రాష్ట్రంలోని కోటి 6 లక్షల కుటుంబాలకు ఉచితంగా అందిస్తున్నామని, దేశంలో ఎక్కడా రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేయడం లేదన్నారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పేరుతో పేదలను దారుణంగా మోసం చేస్తే, తమ ప్రభుత్వం ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు అందిస్తూ నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే 5 లక్షల రూపాయలు జమ చేస్తోందని స్పష్టం చేశారు. మొదటి విడతలోనే 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశామని, రెండో విడత ఇండ్ల మంజూరుకు కూడా కేబినెట్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. ముఖ్యంగా జూన్ 2 రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నుంచి కోటి 15 లక్షల కుటుంబాలకు రూ. 5 లక్షల ఉచిత ‘ఇందిరమ్మ బీమా’ పథకాన్ని ప్రారంభిస్తున్నామని, ఇది పేద కుటుంబాలకు కొండంత రక్షణ కవచంలా నిలుస్తుందని ఆనందం వ్యక్తం చేశారు.
నిబద్ధతతో పనిచేస్తే గుర్తింపు ఖాయం : మంత్రి తుమ్మల
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలుగా క్రమశిక్షణతో, కష్టపడి పనిచేసిన సీనియర్ నాయకులకు నేడు సుడా చైర్మన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవులు దక్కడం అత్యంత సంతోషకరమని అన్నారు. నిబద్ధత, నిజాయితీతో పనిచేసే ప్రతి ఒక్కరికీ రాష్ట్ర నాయకత్వం భవిష్యత్తులో తప్పకుండా తగిన గుర్తింపు ఇస్తుందని చెప్పారు. పువ్వాళ్ల దుర్గా ప్రసాద్కు ఈ పదవి రావడం తనకు వ్యక్తిగతంగా ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని, ఖమ్మం నగరంతో పాటు పరిసర మండలాల సర్వాంగీణ అభివృద్ధికి సుడా ద్వారా మరిన్ని అదనపు నిధులు తీసుకురావాలని సూచించారు. ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రానికి భారీగా అప్పులు ఉన్నప్పటికీ ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల అమలులో ఎక్కడా చిన్న లోటు కూడా లేకుండా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎంపీ సహా నూతన చైర్మన్లను కాంగ్రెస్ శ్రేణులు అత్యంత ఘనంగా సన్మానించాయి. ఈ మహా సభలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, హస్తకళల సంస్థ చైర్మన్ నాయుడు సత్యనారాయణ, ప్రజాప్రతినిధులు, వేలాది మంది కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేశారు.

