బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయం
ప్రజల్లో కాంగ్రెస్ తీవ్ర వ్యతిరేకత..పరిపాలనలో కాంగ్రెస్ విఫలం
ప్రజాపాలన పేరుతో సర్కారు నియంతృత్వ ధోరణి
మోసపూరిత హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి
రైతుల పక్షాన మాట్లాడిన ఆర్టీసీ డ్రైవర్ సస్పెన్షన్ దుర్మార్గం
ఉద్యోగిని విధుల్లోకి తీసుకోకపోతే ఆర్ఎం కార్యాలయం ముట్టడి
కరీంనగర్ను పార్టీ రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలపాలి
గ్రామస్థాయిలో సభ్యత్వ నమోదు విస్తృతంగా చేపట్టాలి
బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేత మాజీ మంత్రి గంగుల కమలాకర్
కాకతీయ, కరీంనగర్: కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిందని, ఇప్పుడు పరిపాలనలో పూర్తిగా విఫలమైందని, ప్రజల్లో ఆ పార్టీపై తీవ్ర వ్యతిరేకత పెరుగుతున్నందున తిరిగి బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేత మాజీ మంత్రి గంగుల కమలాకర్ ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్లో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఈసారి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పూర్తిగా డిజిటల్ విధానంలో చేపడుతున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని గ్రామస్థాయిలో విస్తృతంగా నిర్వహించి కరీంనగర్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలపాలని గంగుల కమలాకర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా ప్రతి గ్రామంలో నాయకులు, కార్యకర్తలు ప్రజలను సభ్యత్వ నమోదులో భాగస్వాములను చేయాలని సూచించారు. ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోందని విమర్శించారు. ధాన్యం కొనుగోలు అంశంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే జగిత్యాల ఆర్టీసీ డ్రైవర్ అశోక్పై సస్పెన్షన్ విధించడం దుర్మార్గమన్నారు.
ఆర్టీసీ డ్రైవర్ అశోక్ సస్పెన్షన్పై ఆగ్రహం
ప్రభుత్వాన్ని ప్రశ్నించినంత మాత్రాన ఉద్యోగిపై చర్యలు తీసుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని గంగుల కమలాకర్ మండిపడ్డారు. డ్రైవర్ అశోక్ సస్పెన్షన్ను వెంటనే ఎత్తివేసి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నేతలతో కలిసి ఆర్టీసీ ఆర్ఎంకు వినతిపత్రం సమర్పించారు. డ్రైవర్ను వెంటనే విధుల్లోకి తీసుకోకపోతే ఆర్ఎం కార్యాలయం ఎదుట బైఠాయింపు చేపట్టి ముట్టడిస్తామని హెచ్చరించారు. అశోక్కు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ రెండు కార్యక్రమాలలో సభ్యత్వ నమోదు ఇన్చార్జి కొండూరి రవీందర్రావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, మాజీ మేయర్ సర్దార్ రవీందర్సింగ్, నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, పొన్నం అనిల్కుమార్ గౌడ్, కార్పొరేటర్లు, మాజీ ప్రజాప్రతినిధులు మరియు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

